సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. కూటమి సర్కార్ పాలనపై మండిపడ్డారు.
తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యకు గురైన అబ్దుల్లా మృతదేహాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. అనంతరం, పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘గడిచిన 24 గంటల వ్యవధిలో తాడిపత్రిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. గంజాయి, మట్కా, పేకాట క్లబ్బులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేస్తున్నారు. తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?’ అని ప్రశ్నించారు.


