ఎంఎస్‌ఎంఈలకు రూ.47,402 కోట్ల రుణాలు | Loans of Rs 47,402 crore to MSMEs | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు రూ.47,402 కోట్ల రుణాలు

Apr 6 2021 2:50 AM | Updated on Apr 6 2021 2:50 AM

Loans of Rs 47,402 crore to MSMEs - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) రూ.47,402.15 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని ఆ పత్రంలో పేర్కొంది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్‌ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు..  రూ.3,900 కోట్ల రుణాలను వైఎస్సార్‌ నవోదయం పేరిట వన్‌టైమ్‌  పునర్‌వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నాబార్డు వివరించింది.

రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని.. రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్‌ బ్యాంకులు మరింతగా ఆర్థికసాయం అందించాలని నాబార్డు సూచించింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్‌ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. 2020–23 రాష్ట్ర పారిశ్రామిక విధానంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని నాబార్డు పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement