దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్‌ జగన్‌దే | Handover of Govt Lands to Real Estate Firms by the Chandrababu Govt | Sakshi
Sakshi News home page

దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్‌ జగన్‌దే

Mar 30 2026 6:01 AM | Updated on Mar 30 2026 12:58 PM

Handover of Govt Lands to Real Estate Firms by the Chandrababu Govt

70% పనులు పూర్తయ్యింది ఆయన హయాంలోనే..

భూసేకరణ దగ్గర నుంచి పునరావాస కాలనీల నిర్మాణం కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలోనే

చంద్రబాబు సర్కారులో కమీషన్ల కోసం ఆగిపోయిన పనులు

అయినా క్రెడిట్‌ చోరీకి టీడీపీ విశ్వప్రయత్నాలు

దీనిపై ‘పోర్టుకు పోదాం పదండి’ ఉద్యమానికి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో  సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్‌ 19న శంకుస్థాపన చేశారు. 

మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. 

అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్‌ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్‌సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్‌లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.  

నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’  
మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్‌ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement