సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు. ఏపీలో పెట్రో కొరతకు సంబంధించి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయన సమీక్షలో అధికారులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కంపెనీలు రిటైల్ ఔట్లెట్లకు ఇంతకు ముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీని ఫలితంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత కొనసాగుతోందన్నారు. అధికారులతో చెప్పిన దానితో ఏకీభవించిన చంద్రబాబు.. ఈ ఇంధన సంక్షోభాన్ని తొందరగా నిలువరించాలని చంద్రబాబు సూచించారు.
కాగా, మూడు రోజుల నుంచి ఏపీలో పెట్రో కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నయార, రిలయన్స్, జియో బంకులకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శనివారం పెట్రోల్, డీజిల్ డిమాండ్ 34 శాతం పెరగగా, ఆదివారం 22 శాతం పెరిగింది.
విజయవాడ నుండి తిరుపతి వరకు హైవేలలో అనేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సమస్య ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


