సమావేశంలో మాట్లాడుతున్న సుబ్బరావమ్మ
మంత్రి ఇచ్చిన హామీ అమలు చేయలేదని మండిపాటు
ఉద్యమిస్తే వేతనాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు
ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేదేలేదు
దశలవారీ పోరాటాలు చేస్తాం
స్పష్టం చేసిన యూనియన్ నేతలు
సాక్షి, అమరావతి: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏడాది నుంచి వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదన్నారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
ఆ సమయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చలకు పిలిచి సీఎంతో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తామని చెప్పి ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే జీతాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదని లేదని.. డిమాండ్స్ సాధనకు మరోసారి పోరుబాట పడతామని సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.నాగశేషు, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, కోశాధికారి బి.లక్షి్మదేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ తీర్మానంలో ఆమోదించిన డిమాండ్లు ఇవే..
⇒ నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి
⇒ హెల్పర్ ప్రమోషన్ గైడ్లైన్స్ జీఓ 5కు సవరణ చేయాలి.
⇒ మేలో ప్రీ స్కూల్ పిల్లలకు నెల మొత్తం టేక్ హౌస్ రేషన్ (టీహెచ్ఆర్) ఇచ్చి అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలి
⇒ గ్రాట్యుటీకి నిర్ధిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చి అమలు చేయాలి


