చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణను ఆపాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న,రైతు సంఘం మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు డిమాండ్ చేశారు. సోమవారం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవిఅగ్రహారం గ్రామాల రైతులు నిర్వహించిన జి.కొత్తపల్లి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర మండుటెండలో జరిగిన పాదయాత్రలో వారు రైతులకు మద్దతుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ 4 గ్రామాల పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరిట 262 ఎకరాల భూమిని భూ సేకరణ చేస్తున్నట్టు గతంలో సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వడంతో తమ భూములను ప్లాంట్ ఏర్పాటుకు ఇవ్వబోమని ఇప్పటికే నోటీసులకు సమాధానం చెప్పినా తహసీల్దారు పోలీసుల సహకారంతో అయినా భూములను బలవంతంగా సేకరిస్తామని బెదిరిస్తున్నారన్నారు. నాలుగు గ్రామాల్లో కలసి 262 ఎకరాల భూముల సేకరణ పేరిట రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల క్రితమే సాగుదారులకు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్ ద్వారా ద్వారా 57.97 మెగావాట్ల సోలర్ ప్లాంట్ నిర్మించనున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో ఉన్న వందలాది మంది రైతు కుటుంబాలు పాయాయిల్, నువ్వులు, వేరుశనగ పంటలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు.


