ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ చేసిన అనంతరం బంగారం వెండి,ఆభరణాలను దుండగులు ఆలయం వెనుక తోటలో వదిలే యగా పోలీసు జాగిలాలు గుర్తించాయి. ఈ మూటలో 56 గ్రాముల బంగారం, 2.70కిలోల వెండి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే దాదాపు ఆరేళ్లనుంచి భక్తులు ఇచ్చిన కానుకలను లెక్కించి హుండీల్లోనే వేసేస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఏడాదికి నాలుగు పర్యాయాల చొప్పున 24 సార్లు పరాకామణి( హుండీల ఆదాయం లెక్కింపు) నిర్వహించారు.ఇలా లెక్కించినపుడు నగదు ఎంత వచ్చింది, వెండి, బంగారం ఎంత వచ్చింది అనే వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించడం లేదు. చోరీ జరిగింది కాబట్టీ నగదు మాట ఎలా ఉన్నా వెండి, బంగారం వివరాలు కచ్చితంగా తెలియజేయాలి. కానీ దొరికిన బంగారం గురించి మాత్రమే చెబుతున్నారు. అసలు కానుకల రూపంలో ఎంత బంగారం వచ్చిందనే దానికి లెక్కలున్నాయా? లేవా?... ఉంటే ఎంత ఉండాలి, దొంగలు వదిలేయడంతో దొరికిన బంగారానికి, రిజిస్టర్లో నమోదు చేసిన బంగారానికి సరిపోయిందా లేదాఅనే వివరాలు వెల్లడించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కానుకల రూపంలో వచ్చిన బంగారం భారీగానే ఉంటుందని, ఈవిషయాన్ని బయటపెడితే ఇబ్బంది ఎదురవుతుందనే బయటకుచెప్పడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికవరీ విషయంలో ఉన్నతాధికారులనుంచి ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుందన్న కారణంగానే వాస్తవంగా ఎంత బంగారం ఉండాలనే దానిపై పోలీసులు కూడా విచారణ చేపట్టడం లేదని భక్తులు అంటున్నారు. చోరీజరిగి నాలుగు రోజులు గడుస్తున్నా టీటీడీ నుంచి ఒక్క అధికారి కూడా ఉపమాక వచ్చి విచారణ చేపట్టకపోవడం విశేషం.


