ఎటువంటి పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దోపిడీ ద్వారా కూటమి నేతలు ఏడాదికి ఏకంగా రూ.100 కోట్ల మేర అక్రమార్జనకు తెరలేపారు. ఈ వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు రివర్స్ కేసులు పెడుతుండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ సాగుతున్న ఈ మైనింగ్ ద్వారా ప్రతిరోజూ 150 నుంచి 200 లోడ్ల మేర గ్రావెల్ తరలిపోతోంది. నంబర్ ప్లేట్లు లేని టిప్పర్లలో నిబంధనలకు విరుద్ధంగా 60 నుంచి 70 టన్నుల ఓవర్ లోడ్తో ఈ రవాణా సాగుతోంది. మార్కెట్లో ఒక్కో ట్రిప్పు గ్రావెల్ను రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. అంటే రోజుకు రూ.22.50 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.82 కోట్ల నుంచి రూ.109 కోట్ల మేర అక్రమ మైనింగ్ దోపిడీ జరుగుతోంది. మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లుండీ కబోదుల్లా వ్యవహరిస్తుండటంతో స్థానిక యాదవ సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఆవులు, మేకలు, గొర్రెలను మేపుకునేందుకు కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.


