● వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయండి
● మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు
కె.కోటపాడు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదని, హామీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా జూన్ 4 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. కె.కోటపాడులో పార్టీ నాయకులతో ఆదివారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు హామీలకు మోసపోయి అన్ని వర్గాల ప్రజలు ఇప్పడు చింతిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చేసిన వంచనను నిరసిస్తూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 4న మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. 8,9 తేదీల్లో మాడుగులలో క్లోజ్డ్ మీటింగ్లు, 12న చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించడంతో పాటు నిరసన తెలపనున్నట్లు ఆయన చెప్పారు. 12న జరిగే కార్యక్రమానికి నాలుగు మండలాల్లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్, గొర్రుపోటు వెంకటరావు, ఏటుకూరి రాజేష్, రొంగలి సూర్యనారాయణ, వేచలపు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.


