మాడుగుల: బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమైనదని, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్సీపీ మాడుగుల నియోజకవర్గ బూత్లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని చోడవరంలో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా గ్రామాల్లోకి వస్తున్న సర్వే అధికారులతో కలిసి బూత్ ఏజెంట్లు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఏజెంట్లు, పార్టీ నాయకులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఫారం, 6, 7, 8, గురించి అవగాహన కల్పించారు.
దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి తదితర అంశాల గురించి లేజర్స్క్రీన్పై స్వయంగా బూడి ముత్యాలనాయుడు అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం బూత్ ఏజెంట్లు అడిగిన ప్రశ్నలకు బూడి ముత్యాలనాయుడు సమాధానాలు చెప్పారు.
వచ్చే నెల 4 వ తేదీ నుంచి వైఎస్సార్ సీపీ చేపట్టబోయే ఉద్యమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొనడంతో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్ వన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు పైలా శ్రీనువాసరావు, మాడుగుల మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, దేవరాపల్లి జెడ్పీటీసీ, ఎంపీపీలు కర్రి సత్యం, చింతల బుల్లి లక్ష్మితో పాటు నియోజకరవ్గంలో గల బూత్ లెవెల్ ఏజెంట్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


