పాడేరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని పాడేరు సీఐ డి.దీనబంధు సూచించారు. మండలంలోని గుత్తులపుట్టు సంతబయలు వద్ద ఆదివారం గ్రామస్తులకు నష్టాలతో పాటు హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, మహిళ భద్రతపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా, సేవించడం చట్ట విరుద్దామన్నారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. గంజాయి రవాణా చేస్తూ ఇప్పటికే చాలా మంది జైలు జీవితం గడుపుతున్నారన్నారు. గ్రామాల్లో ఎక్కడైన గంజాయి రవాణాదారులు, స్మగ్లర్లు సంచరిస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. ద్విచక్ర వాహనచోదకులు ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. మహిళలు, విద్యార్థిలను వేధించడం, ఈవ్టీజింగ్ చేయడం నేరమన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత బ్యాంకు సమాచారం, పిన్ నెంబర్లు ఎవరికీ చెప్పవద్దన్నారు. ఎవరైనా మోసపూరిత లింక్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయోద్దన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించి శాంతియుత జీవితం గడపాలని సూచించారు.
అరకులోయటౌన్(పాడేరు రూరల్): మండలంలోని సుంకరమెట్ట వారపు సంతలో అరకులోయ ఎస్ఐ మల్లేశ్వరరావు ఆదివారం స్థానికులకు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత, గ్రామస్తులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఉన్నత విద్య అభ్యసించి, జీవితాలకు బంగారుబాట వేసుకోవాలని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలన్నారు. వాహనచోదకులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఎస్ఐ సురేష్ సందర్శించారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని కోరారు. గంజాయి రవాణా వంటి నేరాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రత పాటించాలని సూచించారు. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని మహిళలను, బాలికలను వేధించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులకు పుస్తకాలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.


