పాడేరు: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపా ధ్యాయ వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఇచ్చిన మాట తప్పిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రఘునాఽథ్ విమర్శించారు. ఆదివారం పాడేరులో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో టీడీపీ పెద్దలు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వస్తే 12వ పీఆర్సీ అమలు చేసి ఉద్యోగ, ఉపాద్యాయులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తామని, ఆర్థిక బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని డీఏలను బకాయి లేకుండా ఎప్పటికప్పుడు జమ చేస్తామని, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు పూర్తవుతున్నా కనీస స్పందన లేదన్నారు. పీఆర్సీ అమలు కాకపోవడంతో పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సుమారు రూ. 30వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.9500 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మూడేళ్లుగా సరేండర్ లీవ్ బకాయిలు చెల్లించలేదన్నారు, ప్రతిపక్షంలో ,ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహారించడం కూటమీ పార్టీలకే చెల్లిందన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే కూటమీ ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాక తప్పదని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టిబాబు, సహాయ అధ్యక్షుడు చీకటి నాగేశ్వరరావు, కోశాధికారి ఎం. ధర్మారావు, జిల్లా కార్యదర్శులు పి.దేముడు, ఎస్,కన్నయ్య, ఎం, శ్రీను, పలు మండలాలకు చెందిన యూటీఫ్ అద్యక్ష, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు


