కలెక్టర్ నిశాంతి
పాడేరు: హుకుంపేట మండలం మజ్జివలస, పరిసర గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఇటీవల స్థానిక గిరిజనుల ఆందోళనలను పరిష్కారిస్తామని ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్టు కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మజ్జివలస ప్రాంతంలో సర్వేలు, పరిశోధనలు, క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలనుకునే ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఏజెన్సీలు ముందస్తుగా స్థానిక రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని అనుమతులు పొందాలన్నారు. ఈ మేరకు స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు, సమాచారాన్ని అందించేందుకు కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా కంట్రోల్ రూం నంబర్లు 9281856953, 08935–293448 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో జరిగే అన్ని కార్యకలాపాలు చట్టాలకు అనుగుణంగా, పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో గిరిజన, చట్టాలు, హక్కులను గౌరవిస్తూ నిర్వహించాలని అధికారులకు ఆదేశించామన్నారు.


