ముంచంగిపుట్టు: జోలాపుట్టు స్పిల్వే జలాశయం జూన్ మొదటి వారం వచ్చినా జలకళ లేక వెలవెలబోతోంది. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఈ జలాశయం నీరు ఆధారం. జోలాపుట్టులో ఉన్న ప్రధాన, స్పిల్వే జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా.. ప్రధాన జలాశయంలో 2718.30 అడుగుల నీటి మట్టం శుక్రవారం నమోదైంది. అయితే జోలాపుట్టు స్పిల్వే జలాశయం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రసుత్తం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో నీటి సమస్య లేదు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన నాటికి వర్షాలు పడి, నీటి మట్టం స్థాయి పెరిగితే నీటి సమస్య తీరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


