● ఎన్నికల హామీలు నెరవేర్చలేని
చేతకాని ప్రభుత్వం
● మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు
మాడుగుల రూరల్: చంద్రబాబు రెండేళ్ల పాలనకే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, సూపర్ సిక్స్ హామీలు గాలికొదిలేశారని, అన్ని వర్గాల వారిని మోసం చేశారని శ్రీకాకుళం, మన్యం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. ఽశుక్రవారం మాడుగులలో వైఎస్సార్సీపీ బైక్ ర్యాలీ అనంతరం ఆయన స్థానిక పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. తల్లికి వందనం పేరు మార్చి ఎంతో మందికి అర్హులకు వర్తింప చెయ్యలేదన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వలేదన్నారు. గతంలో అర్హులందరికీ పింఛన్లు అందిస్తే, నేడు ఎంతో మంది దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు పింఛను కోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిత్యం తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ –2025 పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు. రెండు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏమి మేలు చేశారని ప్రశ్నించారు. దీనిపై తాము చేపట్టిన ర్యాలీ మాడుగులలో విజయవంతం అయిందన్నారు. ఈ ర్యాలీకి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలి రావడం ఆనందదాయకమన్నారు. లక్ష్యానికి మించి అన్ని గ్రామాలు నుంచి తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
మారుమూల గ్రామాలకు రోడ్లు వేశా..
నియోజకవర్గంలో తన హయాంలో మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మించామని, మాడుగుల నడిబొడ్డున కోట్లాది రూపాయలతో పంచాయతీరాజ్ అతిథి గృహం నిర్మించామని బూడి తెలిపారు. జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఎంతోమందికి సొంతింటి కల సాకారం చేశామన్నారు. నేడు సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యలేని సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్ –1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, తదితరులు పాల్గొన్నారు.


