● మెరుగుకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
● వెంటనే మరమ్మతులు చేపట్టాలనిఅధికారులకు ఆదేశం
జి.మాడుగుల: మండలంలోని జి.మాడుగుల–చుట్టుమెట్ట గ్రామాల మధ్య రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వర్షం కురిస్తే చాలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం కూడా సాధ్యం కాక స్థానిక గిరిజన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై చుట్టుమెట్ట గ్రామస్తులు పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేశారు.దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి, రహదారి సమస్యను వివరించారు. రోడ్డు మరమ్మతుల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామస్తుల కష్టాలను తీర్చేందుకు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండం నాయుడు, మాజీ సర్పంచ్ ఐసరం హనుమంతరావు, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.


