● పెదబయలు తహసీల్దార్ లక్ష్మయ్య
పెదబయలు: కలెక్టర్ ఆదేశాల మేరకు, మండలంలో ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తహసీల్దార్ డి.లక్ష్మయ్య తెలిపా రు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
మండలంలో ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో 11 రెవెన్యూ గ్రామాల పరిధిలో 703 మంది రైతులకు రీ–సర్వే పట్టాదారు పాసు పుస్తకాలను గ్రామ సభల ద్వారా పంపిణీ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. భూ రీ–సర్వే పూర్తయిన మిగిలిన గ్రామాల్లో కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే పట్టాల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ రెవెన్యూ సమస్యలు లేదా ఇతర ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రతి సోమవారం తమ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ వెంకటరమణ, ఆర్ఐ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


