● విద్యుత్ వైర్లపై కూలిన చెట్లు
● సీలేరులో నిలిచిన సరఫరా
సీలేరు: ఆంధ్రా –ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఊరట పొందారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉండగా, అనంతరం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంటపాటు కురిసింది. భారీ వర్షం, గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ వైర్లపై కూలిపోవడంతో సీలేరులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జెన్కో సిబ్బంది వెంటనే ఘటనాస్థలాలకు చేరుకుని చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.అలాగే ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అంతర్రాష్ట్ర రహదారిపై, సీలేరు సమీపంలో ఓ భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా నడిచాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


