చింతపల్లి: గిరిజన జీవ ఎరువుల వాడకం ద్వారా నేల సారవంతం కావడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయశాఖ సంయుక్తంగా స్థానిక వారపు సంతలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల్లో అధికంగా రసాయన ఎరువులు వాడకం వల్ల భూమి సారం తగ్గుతుండడంతో పంటలు దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. భూమిలో సారం పెరగడానికి జీలుగు,జనుము వంటి పచ్చిరొట్ట పంటలను పుష్పించే దశకు ముందే నేలలో కలియ దున్నడం వల్ల నేల సారం పెరుగుతుందన్నారు. జీవ ఎరువులు వాడకంతో ఎకరానికి 20 కిలోలు యూరియా వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు, జీవ ఎరువులు, వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు సందీప్నాయక్, వెంకటేష్ బాబు, జోగారావు రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువులు వినియోగం, నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. రైతులకు ద్రవ,జీవ ఎరువులు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు పంపిణీ చేపట్టారు. పాలిటెక్నిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి


