ముంచంగిపుట్టు: ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని ఆమె, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఆధార్ నమోదు చేసుకున్న 26 మంది లబ్ధిదారులకు వారు నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ఆధార్ కార్డులలో తప్పుల సవరణ, కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్ వంటి సమస్యల పరిష్కారం కోసమే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐదు నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలన్నారు. అలాగే పెద్దలు తమ వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) అప్డేట్స్, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీలలో తప్పుల సవరణతో పాటు ఉచిత డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చని సూచించారు. పదేళ్లు దాటిన ఆధార్ కార్డులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పత్రాలను అప్డేట్ చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం మండల కేంద్రంలోని జీటీడబ్ల్యూఏబాలికల పాఠశాల–1లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ, పీవో ఆదిత్య వర్మ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎలీపవో పీఎస్ కుమార్, ఎంపీడీవో ధర్మారావు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ


