● భర్త వేధింపులే కారణం
● దర్యాప్తులో గుర్తించిన పోలీసులు
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
● జి.మాడుగుల సీఐ లక్ష్మణరావు వెల్లడి
పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ మండభ గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండభ గ్రామానికి చెందిన కించెయి నవీన్సాగర్, అరుణ (27) దంపతులు. భర్త నవీన్సాగర్ తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన అరుణ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన నవీన్సాగర్ తలుపులు తెరిచి చూడగా, భార్య అరుణ ఉరికి వేలాడుతూ కనిపించింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉన్నట్లు పోలీసులు తెలిపారు.మృతురాలి తండ్రి మఠం దేవరాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు, ఎంఆర్వో లక్ష్మయ్య, క్లూస్ టీమ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనాస్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించాయి. అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు తెలిపారు.


