ఆసియాకప్‌: ఫైనల్లో భారత్‌కు చుక్కెదురు | Bangladesh Women Won By 3 Wkts Against India | Sakshi
Sakshi News home page

Jun 10 2018 2:53 PM | Updated on Jun 10 2018 3:02 PM

Bangladesh Women Won By 3 Wkts Against India - Sakshi

బంగ్లా మహిళల సంబరాలు

కౌలాలంపూర్‌ : ఆసియాకప్‌ మహిళల టీ20 టైటిల్‌ను బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఫైనల్లో  మూడు వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. వరుసగా గత ఆరు టోర్నీల టైటిళ్లను నెగ్గిన భారత్‌కు ఈ సారి బంగ్లాదేశ్‌ షాక్‌ ఇచ్చింది. లీగ్‌ మ్యాచ్‌లో సైతం భారత్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ మహిళలు అదే ప్రదర్శనను తుది పోరులో సైతం పునరావృతం చేసి టైటిల్‌ నెగ్గారు. ఫలితంగా తొలిసారి బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.

హర్మన్‌ మినహా..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల్లో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(56) మినహా అందరూ విఫలమయ్యారు. . స్మృతీ మంధాన(7), దీప్తి శర్మ(4), మిథాలీ రాజ్‌(11), అనుజా పటేల్‌(3 ఆబ్సెంట్‌ హర్ట్‌)లు తీవ్రంగా నిరాశపరచడంతో భారత్‌ కేవలం 113 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించింది. స్వల్పలక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్‌ మహిళలు సైతం తడబడ్డారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌నే విజయం వరించింది.  ఓపెనర్లు షమిమా సుల్తానా(16), అయేషా రెహ్మాన్‌(17)లు మంచి శుభారంభాన్ని అందించినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కలేకపోయారు. నిగర్‌సుల్తానా (27) దాటిగా ఆడే ప్రయత్నం చేసినా పూనమ్‌యాదవ్‌ చక్కటి బంతికి పెవిలియన్‌ చేరింది.

చివర్లో రుమాన్‌ అహ్మద్‌(23) రాణించడంతో బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే కెప్టెన్‌ హర్మన్‌ కట్టడి చేయడంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. కాగా, క్రీజులోకి వచ్చిన జహనార్‌ అలామ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరికి రెండు పరుగులు తీయడంతో బంగ్లా విజయం ఖాయమైంది. ఇక భారత మహిళల్లో పూనమ్‌ యాదవ్‌ 4 వికెట్లు తీయగా.. హర్మన్‌ప్రీత్‌ రెండు వికెట్లు తీసింది.  ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ అవార్డు హర్మన్‌ ప్రీత్‌కు దక్కగా.. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ రుమాన్‌ అహ్మద్‌ను వరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement