
పౌరులను వేరుపర్చడమే మత రాజ్య పునాది..!
క్షత్రియుడు పాలిస్తాడు, బ్రాహ్మణులు విద్యా బోధ చేస్తారు. వైశ్యులు వాణిజ్యం చేస్తారు. శూద్రులు శ్రమ చేస్తారు.
క్షత్రియుడు పాలిస్తాడు, బ్రాహ్మణులు విద్యా బోధ చేస్తారు. వైశ్యులు వాణిజ్యం చేస్తారు. శూద్రులు శ్రమ చేస్తారు. ఇక ‘అంటరాని’వారు పై నాలుగు కులాలపై ఆధారపడి జీవిస్తారు. మన ధర్మసూత్రాల ప్రకారం ఇదే హిందూ రాజ్య ఆదర్శం. ఇస్లామిక్ రాజ్యం ముస్లిమేతరులను తృణీకరిస్తుండగా, హిందూ రాజ్యం మొదట హిందూయేతరులను తర్వాత హిందువులలో కొందరిని వేరుపరుస్తుంది. హిందూ రాజ్య ధర్మం గురించి ఆరెస్సెస్ నిజంగా స్పష్టం చేసినట్లయితే భారతీయ ముస్లింలు, క్రిస్టియన్ల విషయం మర్చిపోండి, హిందూ మెజారిటీ కూడా అలాంటి దాన్ని ఆమోదించలేదు మరి.
ఇస్లామిక్ దేశాల్లో నేరాలకు షరియా చట్టం వర్తింపు ప్రభుత్వ మతాధికార వైఖరిలో భాగంగానే ఉంటుంది. చరిత్రలో జైళ్లు అనేవి ఉనికిలో లేని కాలంలో ప్రపంచమంతటా మరణ శిక్ష అతి సాధారణంగా అమల్లో ఉండేది. అందుకే చితక బాదుడులు, అంగ విచ్ఛేదనలు, రాళ్లతో కొట్టడాలు, తలలు నరకడాలు వంటివి ఈరోజు మనకు అనాగరికంగా కనిపిస్తుంటాయి కానీ, క్రీ.శ.7వ శతాబ్ది నాటి ప్రపంచంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా చోటుచేసుకునేవి.
ఇలాంటి వైఖరి మరొక భాగం ఏదంటే పౌరులను వేరుగా చూసే మినహా యింపు లేదా నిరాకరణ. మతాధికారి పాలిత రాజ్యం ఏదైనా సరే.. మినహా యింపు లేదా నిరాకరణ సూత్రం మీద మాత్రమే నిర్మితమై ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్లో దాని రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులు ఎన్నటికీ ప్రధాని కాలేరు. సిక్కులు దేశాధ్యక్షులు కాలేరు. ఈ సందర్భంలో తన ప్రత్యేక గుర్తింపు ద్వారా, అసలు సిసలు పౌరులుగా గుర్తింపు పొందుతున్న సాధారణ ప్రజానీకానికి భిన్నంగా మైనారిటీలతో వ్యవహరించడం ద్వారానే మతప్రాతిపదిక ప్రభుత్వం తన్ను తాను వ్యక్తీకరించుకుంటుంది.
లియాఖత్ ఆలీ ఖాన్ పాకిస్తాన్ రాజ్యాంగ రచన ప్రారంభించినప్పుడు పరి స్థితి ఇలా ఉండేది కాదు. తర్వాత అయూబ్ఖాన్, జుల్ఫికర్ ఆలీ భుట్టో హయాం లోనే పౌరుల పట్ల ఇలాంటి నిరాకరణ విధానం ఉనికిలోకి వచ్చింది. అయితే పాకి స్తాన్ను మినహాయిస్తే, ఇరాన్ నుంచి సౌదీ అరేబియా వరకు ఏ ఇస్లామిక్ దేశంలో కూడా ముస్లిమేతరులను వేరుగా చూసే మినహాయింపు విధానం ఒక మూల సూత్రంగా అమలు కావడం లేదు.
నేపాల్ శాసనకర్తలు కొద్దిరోజుల ముందు, హిమాలయ దేశం నేపాల్ను హిందూ రాజ్యంగా ప్రకటిస్తూ దేశ నూతన రాజ్యాంగ ముసాయిదాలో సవరణ చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేశారు. రాజరికాన్ని, హిందూ దేశ ప్రతి పత్తిని పునరుద్ధరించాలని రాజధాని ఖాట్మండులో నిరసనకారులు డిమాండ్ చేస్తూ పోలీసులతో ఘర్షణలకు దిగారు.
చాలామంది నేపాలీలు తమ రాజులను సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతార పురుషులుగా విశ్వసిస్తుంటారు. వీరంతా రాజరిక పునరుద్ధరణను బలపరుస్తారు. రాజ్యాంగం ప్రకారం ఈరోజు నేపాల్ ఒక లౌకిక దేశం కావచ్చు కానీ, రాజరికం రద్దయ్యేంతవరకు అది శతాబ్దాలుగా హిందూ రాజ్యంగా ఉంటూ వచ్చింది. ఇండియాలోనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తోపాటు భారతీయ జనతా పార్టీలోని పలువురు కూడా దేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నందున ఇది కూడా పౌరులను వేరుగా చూసేదిగానే ఉంటుందేమో పరిశీలిద్దాం.
ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గత సంవత్సరం నేను ఇలా రాశాను: ‘‘2008 వరకు భూమ్మీద నేపాల్ ఒక్కటే హిందూ రాజ్యంగా ఉండేది. 2008న రిపబ్లిక్ ఆవిర్భవించడంతో ఛెత్రి (క్షత్రియ) రాజరికం ముగిసిపోయింది. నేపాల్ హిందూ రాజ్యంగా ఎందుకుండేది? ఎందుకంటే హిందూ న్యాయస్మృతి అయిన మనుస్మృ తిలో పేర్కొన్నట్లుగా రాజ్యపాలనాధికారం ఇక్కడ కూడా చక్రవర్తికే యుద్ధ ప్రభువుకే సంక్రమిస్తూ వచ్చేది. ఆ అర్థంలో మాత్రమే నేపాల్ హిందూ రాజ్యంగా ఉండేది. ఇది మినహా హిందూ స్మృతిసూత్రాల నుంచి దానికి వర్తించేది అంటూ ఏదీ ఉండేది కాదు. ఎందుకంటే హిందూ స్మృతి సూత్రాలలో అధికభాగం మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు భిన్నంగానే ఉండేవి.’’
దీని ద్వారా నేనేం చెప్పదల్చుకున్నాను? అంటే హిందూ రాజ్యంలో కులాన్ని ప్రవేశపెట్టినందుకే కావచ్చు. దాని హిందుత్వాన్ని మనం రెండు విధాలుగా చూడ వచ్చు. ఇండియా విషయంలో మనం ఇప్పుడు దృష్టి పెడుతున్న బాహ్య అంశం ఏదంటే అది ఆర్ఎస్ఎస్ ప్రాపంచిక దృక్పథానికి సంబంధించినది కావడమే. ఆరెస్సెస్ హిందూ రాజ్య సిద్ధాంతం ముస్లింలు, క్రిస్టియన్లను వేరుపర్చడం లేదా నిరాకరించడంపైనే రూపొందింది. నేపాల్లో అది అంతర్గతంగా ఉండేది. అంటే అది ప్రధానంగా క్షత్రియ రాజుపైనే దృష్టి పెట్టేది. ఈ అంశమే దాన్ని హిందూ దేశంగా రూపొందించింది.
కాని హిందూ రాజ్య భావనకు ఇది మాత్రమే సరిపోదు. మనుస్మృతిని చూస్తే అది కేవలం రాజరికాన్ని మాత్రమే కాకుండా ఇతర కులాల స్థానాన్ని కూడా నిర్దే శించింది. దాని ప్రకారం క్షత్రియుడు పాలిస్తుండగా, బ్రాహ్మణులు బోధిస్తారు, వైశ్యులు వాణిజ్యం చేస్తారు. శూద్రులు శ్రమ చేస్తారు. ఇక అంటరానివారు పై నాలుగు కులాలపై ఆధారపడి జీవిస్తారు. ఏ కులం కూడా ఎన్నటికీ మరో కులం వ్యవహారాలలో తలదూర్చలేదు. మన ధర్మసూత్రాల ప్రకారం ఇదే హిందూ రాజ్య ఆదర్శం. హిందువులలోని వివిధ బృందాలకు డబ్బును, విద్యను, అధికారాన్ని నిరాకరించడం నుంచే ఈ మినహాయింపు వచ్చింది. ఇస్లామిక్ రాజ్యం ముస్లిమే తరులను నిరాకరిస్తుంది. అదే హిందూ రాజ్యం విషయానికి వస్తే అది మొదట హిందూయేతరులను నిరాకరిస్తుంది. తర్వాత హిందువులలోనే కొందరిని వేరు చేస్తుంది. మన రాజ్యాంగంలోని లౌకిక అంశాలు ఏవనే విషయాన్ని చాలామంది భారతీయులు గుర్తించలేకపోతున్నప్పటికీ, హిందూ రాజ్యభావనను ఇండియా లో అంతగా పట్టించుకోకపోవడానికి ఏకైక కారణం ఇదే.
పైగా నేటివరకూ ఆరెస్సెస్ హిందూ రాజ్యం గురించి కేవలం మాట్లాడుతోం ది తప్పితే దాని అర్థమేమిటో ఎన్నడూ వివరించనందుకు కూడా ఇదే కారణం. నిజానికి అది వివరించలేదు కూడా. ఎందుకంటే భారతీయ ముస్లింలు, క్రిస్టియన్ల విషయం మర్చిపోండి, హిందూ మెజారిటీ కూడా అలాంటి దాన్ని ఆమోదించ లేదు మరి. నేపాల్లో కూడా, 601 మంది సభ్యులున్న రాజ్యాంగ సభలో 21 మంది సభ్యులు మాత్రమే రాజరికం మళ్లీ రావాలంటున్న మితవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. అదే ఇండియా విషయానికి వస్తే హిం దూ రాజ్యం అంటే ఏమిటో స్పష్టం చేసిన తర్వాత దానికి మద్దతును కూడగట్టడం అసంభవం, అసాధ్యం కూడా.
నా అభిప్రాయం ప్రకారం, ఈ హిందూ రాజ్యం భావనకు వ్యతిరేకంగా శక్తివంతమైన వాదన చేసినవారు దళిత కార్యకర్త, చంద్రభాన్ ప్రసాద్. ఇండి యాలో హిందూ రాజ్య స్వర్ణయుగ కాలంలో బ్రాహ్మణులు విద్య బోధించేవారనీ, వారి ఏలుబడిలో భారతీయ విద్య స్థితి ఎలా తయారైందో మనం చూశామనీ, భారత మాతను పరిరక్షించే బాధ్యతలను క్షత్రియులు చేపట్టగా.. వారి నిర్వాకంతో భారతమాత శతాబ్దాలపాటు వలసాధిపత్యంలో కూరుకుపోవడం చూశామనీ చంద్రభాను పేర్కొన్నారు. ఇక వైశ్యులు ఆర్థిక వ్యవస్థను నడిపే బాధ్యతలు చేపట్టగా మనం భూమ్మీద అత్యంత నిరుపేద రాజ్యాల్లో ఒకటిగా ఉన్నామని, హిందూ రాజ్యం భారతీయులకు చేసిన మంచి ఏమీలేదని చంద్రభాను ప్రసాద్ స్పష్టం చేశారు.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్