‘భారత్‌తో పాక్‌ డేంజర్‌ గేమ్‌.. తట్టుకోలేదు’ | Pakistan playing dangerous game in Kulbhushan Jadhav case: Parrikar | Sakshi
Sakshi News home page

‘భారత్‌తో పాక్‌ డేంజర్‌ గేమ్‌.. తట్టుకోలేదు’

Apr 15 2017 12:07 PM | Updated on Sep 5 2017 8:51 AM

‘భారత్‌తో పాక్‌ డేంజర్‌ గేమ్‌.. తట్టుకోలేదు’

‘భారత్‌తో పాక్‌ డేంజర్‌ గేమ్‌.. తట్టుకోలేదు’

భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్‌ చాలా ఆపాయకరమైన ఆట ఆడుతోందని రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు.

గోవా: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్‌ చాలా ఆపాయకరమైన ఆట ఆడుతోందని రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. ఒక్కసారి భారత్‌ యాక్షన్‌కు దిగితే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ సరైన ఆధారాలు చూపించకుండానే  కులభూషణ్‌కు పాక్‌ ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారికర్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘కులభూషణ్‌ యాదవ్‌ పేరిట భారత్‌తో పాక్‌ చాలా డేంజర్‌ గేమ్‌ ఆడుతోంది. భారత్‌ తిరుగుబాటుకు దిగితే తిరిగి పోరాడే శక్తి పాక్‌కు లేదు. వారిని వారు ఏ విధంగా రక్షించుకోలేరు. కానీ, మేం శాంతిని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. ఈ విషయం అర్ధం చేసుకొని జాదవ్‌ను తిరిగి పంపిస్తే ఆ దేశానికే మంచిది. ముందుగా ఒక విషయం చెప్పాలి. పాకిస్థానే ఇరాన్‌లో ఉన్న జాదవ్‌ను ఎత్తుకెళ్లింది. అరెస్టు సమయంలో పాక్‌లో లేడు. ఓ తాలిబన్‌ జాదవ్‌ను కిడ్నాప్‌ చేసి పాక్‌ తీసుకెళ్లినట్లు మాకు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలు చేస్తుండటం పాక్‌కు అలవాటు. అవసరం అయితే ఆ దేశం ఇంకోలాగ కూడా చేస్తుంది. ఏదేమైనా జాదవ్‌ను ఉరి తీస్తే చూస్తూ ఊరుకోం. బదులిచ్చి తీరుతాం. ఈ విషయాన్ని ఇప్పటికే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు కూడా’ అని పారికర్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement