నిర్మల్
మంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024నిర్మల్ జూనియర్ కళాశాలలో బారులుతీరిన ఓటర్లు ఓటేసిన ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కూతుళ్లు మొరాయించిన ఈవీఎంలు..
యథావిధిగా ఈ ఎన్నికల్లోనూ పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. చాలా గ్రామాల్లో పొద్దున్నే వచ్చిన ఓటర్ల ఓపికకు పరీక్ష పెట్టాయి. పలుచోట్ల ఓటర్లు నిరీక్షించే ఓపిక లేక వెనుదిరిగి, మళ్లీ వచ్చారు. సమయం వృథా కావడంతో కొంతమంది పోలింగ్ సిబ్బందిపై చిర్రుబుర్రులాడటం కనిపించింది.
● భైంసాలోని 130 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
●ముధోల్ మండలం చించాల గ్రామంలో 30 నిమిషాలపాటు ఈవీఎం మొరాయించింది.
●లక్ష్మణచాంద మండలం పొట్టపల్లిలో ఈవీఎం రెండుసార్లు మొరాయిచింది. టెక్నికల్ అధికారులు వచ్చి, మరో ఈవీఎం ఏర్పాటు చేశారు.
●భైంసాలోని గుజిరిగల్లీ 157 పోలింగ్ కేంద్రంలో సాంకేతిక సమస్యతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది.
●నిర్మల్లోని 238వ పోలింగ్ కేంద్రంలో గంటపాటు ఈవీఎంలు మొరాయించడంతో మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు.
●దిలావర్పూర్ మండలం కాల్వ, దిలావర్పూర్ కేంద్రాల్లో కొద్దిసేపు ఈవీఎంలు పనిచేయలేదు.
● లోక్సభ ఎన్నికల్లో జిల్లాలో భారీగా పోలింగ్
● గత ఎన్నికలకంటే అధికంగా నమోదు
● సహకరించిన వాతావరణం
● ఉత్సాహంగా ఓటేసిన యువఓటర్లు
● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
● పర్యవేక్షించిన ఉన్నతాధికారులునిర్మల్: లోక్సభ ఎన్నికలకు జిల్లా ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి చైతన్యం పెరిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారుల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇక తొలి ఓటు వేసేందుకు యువతరం ఆసక్తిగా తరలివచ్చింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 69.59 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 64.61శాతం కాగా, ఈసారి ఆరు శాతం పెరిగింది. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, అల్లంపల్లి, బాబానాయక్తండావాసుల ఆందోళనలు మినహా.. మొత్తంమీద లోక్సభ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయడంతోపాటు పకడ్బందీగా బందోబస్తు, అనుక్షణం పర్యవేక్షణ చేయడం కనిపించింది. నిండు వేసవిలోనూ పోలింగ్రోజు ఎండ ప్రభావం కూడా లేకపోవడంతో ఓటర్లు రోజంతా ఓటేశారు. ఈసారి కూడా పట్టణ ఓటర్ల కంటే పల్లెవాసులే నయమనిపించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.
రోజంతా పోలింగ్..
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి రోజంతా ఒకేరీతిన కొనసాగింది. ఎండ ఎక్కువగా లేకపోవడం, వాతావరణం చల్లగా ఉండటంతో ఓటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓట్లు వేస్తూ వచ్చారు. గతంలో మధ్యాహ్నం ఓటింగ్ తక్కువగా నమోదయ్యేది. ఈసారి అలాకాకుండా రోజంతా ఒకేలెక్కన నమోదయ్యింది. వేకువజామున 5 గంటల నుంచి 7 గంటల వరక సిబ్బంది మాక్పోలింగ్ చేపట్టారు. అప్పటికే చాలా గ్రామాల్లో క్యూలైన్లు నిండిపోయాయి. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. మొదటి రెండు గంటల్లోనే 13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల వరకే దాదాపు 32 శాతం పోలింగ్ పూర్తయింది. ఇక ఒంటిగంటకే జిల్లాలో 50 శాతం ఓట్లు పడటం విశేషం. ప్రతీ రెండు గంటలకు 10–12శాతం చొప్పున పోలింగ్ నమోదవుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 69.59 శాతం పోలింగ్ నమోదైంది. చివరిగంటలోనూ చాలా గ్రామాల్లో పోలింగ్ శాతం పెరిగింది.
పల్లెలే నయం..
మరోసారి పట్టణ ఓటర్లు ఓటు వేయడంలో కాసింత నిరాసక్తతనే కనబర్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటామని ప్రల్లె ప్రజలు మరోసారి చాటారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సాయంత్రం 5 గంటల వరకు ఖానాపూర్ నియోజకవర్గంలో 67.02 శాతం నమోదుకాగా, ముధోల్లో ఏకంగా 72.73 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే నిర్మల్ నియోజకవర్గంలో 69.03 శాతం నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.
వసతులు భేష్..
లోక్సభ ఎన్నికలకు జిల్లా అధికారులు కల్పించిన వసతులు పర్వాలేదనిపించాయి. ఎండలో వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మినహా చాలా కేంద్రాల్లో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం వాహనాలను, వీల్చైర్లను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చేవారికి సులువుగా ఓటు చూసుకునేలా ఓటర్ హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఏఎన్ఎంతోపాటు దివ్యాంగులకు సహకరించడానికి వలంటీర్లను, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను నియమించారు.
అధికారుల పర్యవేక్షణ..
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికను పూర్తిచేసేందుకు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, ఎస్పీ జానకీషర్మిల నేతృత్వంలోని జిల్లా అధికారబృందం, సిబ్బంది సమష్టిగా శ్రమించారు. పోలింగ్రోజు జిల్లా ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కలెక్టర్ కంట్రోల్రూమ్ నుంచి అన్ని కేంద్రాలనూ పర్యవేక్షించారు.