నైతికత లోపిస్తే భారీ మూల్యం

Corporate Companies CEOs Should Be Honest - Sakshi

కంపెనీ అధినేతలపై అధ్యయనం వెల్లడి  

ప్రవర్తనా లోపాలతో సంస్థలకు భారీ నష్టాలు

వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి ఇష్టం. కానీ పబ్లిక్‌లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత ప్రవర్తన అత్యంత ముఖ్యం. రాజకీయ నాయకులైనా కావొచ్చు, పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీల అధినేతలైనా కావచ్చు. వ్యక్తిగత జీవితంలో నైతికత లోపిస్తే భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. పెద్ద కంపెనీల సీఈవోలు వ్యాపారాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు, నీతీనిజాయితీ లేకపోవడం, విశ్వసనీయత కోల్పోవడం వంటి వాటితో కూడా స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం కనపడుతుందని కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో యాహూ కంపెనీ సీఈవోగా పని చేసిన స్కాట్‌ థాంప్సన్‌ తనకి కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ ఉందని అబద్ధం చెప్పాడన్న విషయం వెలుగులోకి రాగానే ఆ సంస్థకి చెందిన షేర్లన్నీ కుప్పకూలాయి.

ఆ సంస్థకు ఏకంగా 39కోట్ల డాలర్ల నష్టం వచ్చింది. సాక్షాత్తూ ఒక కంపెనీకి చెందిన సీఈవో అబద్ధం చెప్పిన తర్వాత ఆ సంస్థని ఎలా నమ్మాలని ప్రశ్నించిన ఇన్వెస్టర్లు తప్పుకున్నారు. ఇక గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అత్యున్నత పదవిని చేపట్టిన స్ట్రాస్‌ కాన్, తన కింది ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణల పై స్వతంత్ర న్యాయనిపుణులతో విచారణ జరిపించారు. చివరికి ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటివే ఎన్నో ఘటనలు జరిగాయని అమెరికాలోని మిసిసిíపీ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త బ్రాండన్‌ క్లైన్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కంపెనీ అధినేతల వ్యక్తిగత ప్రవర్తన వారి వ్యాపారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశంపై క్లైన్‌ ఒక అధ్యయనం చేశారు.

1978 నుంచి 2012 మధ్య కాలంలో దాదా పు 300 కంపెనీలకు చెందిన సీఈవోల వ్యక్తిగత నడవడికలో లోపాల కారణంగానే వారి సంస్థలకు నష్టాలు వచ్చాయని ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఆయా కంపెనీల సీఈవోల వివాహేతర సంబంధా లు, లైంగికపరమైన సాహసాలు వంటి కారణాలే కంపెనీలు కుప్పకూలడానికి కారణమై 20 కోట్ల డాల ర్ల వరకు నష్టం వచ్చిందని ఒక అంచనా. అంతే కాదు మార్కెట్లలో ఆ కంపెనీలకుండే విలువ 10 నుంచి 15 శాతానికి తగ్గిపోయింది. ఈ అధ్యయనాలన్నీ చూ స్తుంటే సీఈవోలు వ్యక్తిగత జీవితంలో అబద్ధాలు చెప్పినా, ఎవరినైనా దగా చేసినా, నిబద్ధత లేకపోయి నా వారి కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందనేది అర్థమవుతోంది. ఇదే సూత్రం రాజకీయ నేతలకూ వర్తిస్తుంది. వాణిజ్య రంగంలో ఉండేవారి నైతి క ప్రవర్తన సరిగా లేకపోతే వెను వెంటనే మార్కెట్లపై ప్రభావం చూపిస్తే, రాజకీయ రంగాల్లో ఉండేవారి అనుచిత ప్రవర్తన ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఎన్నికల్లో తేలిపోతుంది. పబ్లిక్‌లోకి వచ్చినవారు ఏ రంగంలో వ్యక్తి అయినా ఒకసారి మోసగాడు అన్న ముద్ర పడితే, అతను ఎప్పటికీ మోసగాడుగానే ఉంటాడని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top