సిటీ జామ్ | in hyderabad heavy rain | Sakshi
Sakshi News home page

సిటీ జామ్

Jun 12 2015 11:28 PM | Updated on Sep 3 2017 3:38 AM

సిటీ  జామ్

సిటీ జామ్

సమయం సాయంత్రం 4.30 గంటలు. నాంపల్లి నుంచి పంజగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

జడి వాన..
 
నగరంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం
బస్తీలను ముంచెత్తిన మురుగునీరు
లోతట్టు ప్రాంతాలు జలమయం
నీట మునిగిన ప్రధాన రహదారులు
ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్

 
సిటీబ్యూరో:...సమయం సాయంత్రం 4.30 గంటలు. నాంపల్లి నుంచి పంజగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జడివాన కారణంగా లక్డీకాపూల్ నుంచి పంజగుట్ట వరకు వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ రద్దీలో పంజగుట్ట చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టింది. 6 గంటలకు కానీ గమ్యానికి చేరుకోలేకపోయాడు.
...సాయంత్రం 5 గంటలు... అమీర్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు స్నేహ బస్సులో బయలుదేరింది. రాత్రి 7.40 గంటలకు గానీ నిర్ణీత స్థలానికి చేరుకోలేదు.

 ...పవన్ హైటెక్ సిటీ నుంచి సాయంత్రం 5.30 గంటలకు కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు బయలుదేరాడు. రాత్రి 8.30 గంటలకు ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది.
 ...సుభాష్ రాత్రి 7 గంటలకు బంజారాహిల్స్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉప్పల్‌లోని తన నివాసానికి చేరేసరికి రాత్రి 9.30 అయ్యింది.
 ...గ్రేటర్‌లో శుక్రవారం కురిసిన  జడివానకు లక్షలాది మంది వాహన చోదకులు, ప్రయాణికుల నరక యాతనకు ఇవి తార్కాణాలు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ నరకాన్ని చవిచూశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30  వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు. కుండపోత వర్షానికి తడిసి ముద్దవడంతోపాటు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకపోయింది. ఆర్టీసీ బస్సులు,ఆటోల్లో బయలుదేరిన వారు కూడా రాత్రి పొద్దుపోయాక గానీ ఇళ్లకుచేరుకోలేకపోయారు. ఫ్లైఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారులు, షాపింగ్‌మాల్స్ ఎదుట పార్క్ చేసిన వాహనాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. రహదారులపై మోకాలి లోతున నీరు  ప్రవహించింది. బహదూర్‌పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు జనం అవస్థలు పడ్డారు. పురాతన భవనాల సమీపంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితి తలెత్తింది. రాత్రి 8.30 గంటల వరకు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది.

 నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నరకం..
 ప్రధాన రహదారులపై నీరు నిల్వ కేంద్రాలు 40 వరకు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఆప్రాంతాల్లో మరమ్మతులు పూర్తి కాకపోవడంతో శుక్రవారం పెద్దఎత్తున వర్షపునీరు చేరి వాహనదారులకు నరకం చూపింది. కిమ్స్ ఆస్పత్రి, డీవీ కాల నీ, సీతాఫల్‌మండి-ఆడిక్‌మెట్, మెహదీ ఫంక్షన్ హాల్, రవీంద్ర భారతి (ఫ్రీలెఫ్ట్), ఎన్‌టీఆర్ నగర్-కొత్తపేట్, మలక్‌పేట్-చాదర్‌ఘాట్, తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఆంధ్రా ఫ్లోర్‌మిల్, పిల్లర్‌నెంబర్ 78-80, 102 నుంచి లంగర్‌హౌస్, బాపూఘాట్ న్యూబ్రిడ్జి, బేగంబజార్ పీ ఎస్ తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.

 జంక్షన్ల వద్ద జంఝాటం..
 ప్రధాన రహదారులపై మోకాలి లోతున వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులు, కూడళ్లలో వర్షపునీరు భారీగా నిలిచిపోవడం... ట్రాఫిక్ సిగ్నళ్లు పని చేయకపోవడంతో అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, పంజగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, బేగంపేట్, ప్యారడైజ్ తదితర కూడళ్లు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది.

 ఉప్పొంగిన మ్యాన్‌హోళ్లు
 గ్రేటర్ పరిధిలో సుమారు 4600 కి.మీ. మురుగునీటి కాల్వలు ఉన్నాయి. వీటిపై 1.85 లక్షల మ్యా న్‌హోళ్లు ఉన్నాయి. వేసవిలో వీటిలో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్, మట్టిని 60 శాతం మేరకే తొలగించారు. దీంతో మురుగునీరు రహదారుల ను ముంచెత్తింది. వాహన చోదకులు, పాదచారులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వచ్చింది. జలమండలికి ఉన్న 18 అద్దె ఎయిర్‌టెక్ యంత్రాలతో వేసవిలో అరకొరగా పూడికతీత పనులు చేపట్టడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని బస్తీల వాసులు ఆందోళన వ్యక్తంచేశారు.
 
వర ్షవిలయానికి ఆనవాళ్లివిగో..
బర్కత్‌పుర, కాచిగూడ డివిజన్లలోని లోతట్లు ప్రాంతాలురత్నానగర్, శాస్త్రీనగర్, కృష్ణానగర్ తదితర బస్తీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి.సికింద్రాబాద్ పరిధిలోనిబోరుుగూడ రైల్వే బ్రిడ్జి, రాణిగంజ్ వుుంబ రుు హోటల్, బన్సీలాల్‌పేట కవూన్, బైబిల్ హౌస్ సమీపంలోని బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో నడువుు లోతున వరదనీరు పోటెత్తింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిపొయే ప్రజలు, మోండా వూర్కెట్ వైపు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. ఆర్.పి రోడ్, రాణిగంజ్, బోరుుగూడ, ఒలిఫెంటాబ్రిడ్జి ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది.

దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని ఆర్‌కేపురం హరిపురి కాలనీలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.పాతనగరంలో ఛత్రినాక చౌరస్తాపై ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరదతో నదిని తలపించింది. అక్కడినాలా ఉప్పొంగింది. జనం ప్రమాదపుటంచున నాలా ఒడ్డు నుంచే వెళ్లాల్సి వచ్చింది. వరద నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొరాయించాయి.
 
 
 విద్యుత్ సరఫరాకు అంతరాయం
 గాలివాన బీభత్సానికి శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడ్డాయి. ఫీడర్లు ట్రిప్పవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఐఎస్‌సదన్, మీర్‌పేట్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, జిల్లెలగూడ, బడంగ్‌పేట్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, నాగోలు, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, ఉప్పల్, రామంతాపూర్, చైతన్యపురి, మేడిపల్లి, హబ్సీగూడ, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం, నల్లకుంట, చాంద్రాయణగుట్ట, ఓవైసీ కాలనీ, పహడీషరీఫ్, జల్‌పల్లి, అబిడ్స్, అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం, తదితర ప్రాంతాల్లో రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరించగా... మరికొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు గంటలు పట్టింది. వర్షానికి తోడు వీధుల్లో లైట్లు కూడా వెలగకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement