జై భీమ్‌

Today Ambedkar Jayanti - Sakshi

కవర్‌ స్టోరీ

అట్టడుగు కులంలో జన్మించాడు. పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవి చూశాడు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన కుంగిపోలేదు. తనలో తానే కుమిలిపోలేదు. దుర్భర పరిస్థితులకు ఎదురీదుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు. తన సాటి దళితులు తలెత్తుకుని బతికేలా చేసేందుకు అహరహం కృషి చేశాడు. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాడు. ఆయనే అంబేద్కర్‌. దళితుల ఆత్మగౌరవ ప్రతీక. నేడు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, ఆయన చెప్పిన మాటలను  మననం చేసుకుందాం...

‘‘మనం పోరాడితే తప్ప ఏదీ లభించదు. ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. స్వయం సహాయంతో ముందుకు సాగాలి. మనం తక్కువ వాళ్లం అనే భావన వదిలిపెట్టి సమాజంలోని ఇతర వర్ణాల వారితో సమాన హోదాతో జీవించడానికి ప్రయత్నించండి. మీ అలవాట్లను మార్చుకుని అందరిలా ఆత్మగౌరవంతో బతకండి’’.. మహారాష్ట్రలోని మహద్‌ గ్రామంలో 1927 మార్చి 19న జరిగిన దళిత మహాసభలలో ప్రసంగిస్తూ అంబేద్కర్‌ అన్న మాటలివి. అలాగని ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రసంగించిన మరునాడే దళితుల మానవ హక్కులను అమలుపరచడానికి కార్యరంగంలోకి దిగారు. వందలాది మంది దళితులతో ఊరేగింపుగా ఆ ఊళ్లోని సవర్ణులు వాడుకునే చౌదర్‌ చెరువుకు వెళ్లి, అందులోని నీటిని దోసిలి పట్టి తాగారు. ఆయన అనుచరులందరూ ఆయననే అనుసరిస్తూ ఆ చెరువు నీటిని తాగారు. తరతరాలుగా నిమ్నజాతులలో పాతుకుపోయిన నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సంఘటన అది. నిజానికి మహద్‌లోని చౌదర్‌ చెరువును అన్ని కులాల వారూ ఉపయోగించవచ్చునని మునిసిపాలిటీ 1924లోనే ప్రకటించింది. అయినా అగ్రవర్ణాల వారికి భయపడి అక్కడి దళితులెవరూ ఆ చెరువు జోలికి పోయేందుకు సాహసించలేదు. చెరువు సంగతి తేల్చుకోవడానికే అక్కడ మహాసభలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్‌ ఆ మహాసభలలో పాల్గొని, దళితుల్లో స్ఫూర్తి నింపారు. వారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపారు. ఆయన చొరవతోనే మహద్‌లోని దళితులకు చెరువు నీళ్లను వాడుకునే హక్కు దక్కింది. అంబేద్కర్‌లోని ఈ పోరాట పటిమకు నేపథ్యం ఆయన బాల్యం, ఆయన ఎదుగుదలలోనే ఉంది.

తండ్రి నుంచి స్ఫూర్తి
అంబేద్కర్‌ పూర్తి పేరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్‌. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్‌. తల్లి భీమాబాయి. అప్పటి సెంట్రల్‌ ప్రావిన్స్‌లోని (ఇప్పటి మధ్యప్రదేశ్‌) మహు గ్రామంలో 1891 ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ పుట్టారు. మహులో బ్రిటిష్‌ సైనిక స్థావరం ఉండేది. అంబేద్కర్‌ తండ్రి రామ్‌జీ బ్రిటిష్‌ సైన్యంలో సుబేదారుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. రామ్‌జీ, భీమాబాయి దంపతులకు పద్నాలుగు మంది సంతానం. రామ్‌జీ పూర్వీకులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌గడ్‌కు ఐదు మైళ్ల దూరంలో ఉన్న అంబావాడే రామ్‌జీ వంశీయుల స్వగ్రామం. ఆ ఊరి పేరు మీదే ఆ కుటుంబానికి అంబేద్కర్‌ అనే ఇంటి పేరు వచ్చింది. రామ్‌జీ సక్పాల్‌ మహర్‌ కులానికి చెందినవారు. దళితుల్లో మహర్‌లు కొంత సాహసవంతులు. ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో అందులో చేరిన వారు మహర్లే. రామ్‌జీ కుటుంబ సభ్యులు కబీరు బోధించిన భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేది. భక్తి సంప్రదాయానికి చెందిన ప్రవక్తలు కులభేదాలను పాటించలేదు. ఈ కారణంగానే నాటి దళితుల్లో చాలామంది భక్తి సంప్రదాయానికి ఆకర్షితులయ్యారు. అంబేద్కర్‌ తల్లి భీమాబాయి తండ్రి, ఆరుగురు పినతండ్రులు కూడా సైన్యంలో సుబేదార్లుగా పనిచేసిన వారే. భీమాబాయి తరఫు వారు ముర్‌బాద్‌ ప్రాంతంలో సంపన్నుల కిందే లెక్క. వారిది కూడా కబీరు భక్తి సంప్రదాయమే. రామ్‌జీ ఉద్యోగ విరమణ చేసే నాటికి అంబేద్కర్‌కు రెండేళ్లు మాత్రమే. ఉద్యోగ విరమణ తర్వాత రామ్‌జీ కుటుంబంతో దాపోలీకి చేరుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం లేరు. సతారాలో వేరే ఉద్యోగం వెదుక్కుని అక్కడకు చేరుకున్నారు. తల్లి పోయే నాటికి అంబేద్కర్‌కు ఆరేళ్లు. రామ్‌జీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసేవారు. పిల్లలకు రామాయణ, మహాభారత గాథలను, మహాపురుషుల చరిత్రలను, వీరగాథలను కథలుగా చెప్పేవారు. తుకారాం, ముక్తేశ్వర్, మొరోపంత్‌ల కీర్తనలను పిల్లల చేత పాడించేవారు. రామ్‌జీ ఒక మిలిటరీ స్కూల్‌లో హెడ్మాస్టర్‌గా పనిచేశారు. మరాఠీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఆయనకు చక్కని ప్రావీణ్యం, అనువాద నైపుణ్యం ఉండేవి. తండ్రి శిక్షణలోనే అంబేద్కర్‌ అనువాదంలో మంచి ప్రావీణ్యం సాధించారు. రామ్‌జీకి దళితుల దుస్థితిపై స్పష్టమైన అవగాహన ఉండేది. దళితులను ఆ దుస్థితి నుంచి బయటపడేయడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేశారు. అంటరానితనం వల్ల దళితులు ఎదుర్కొంటున్న వివక్షను ఆయన బొంబాయి గవర్నర్‌ను కలుసుకుని వివరించారు. దళితుల స్థితిగతులను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పట్లో మహర్‌లను సైన్యంలోకి తీసుకోరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. వివక్షాపూరితమైన ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని రామ్‌జీ ప్రభుత్వానికి అర్జీ రాశారు. తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితోనే అంబేద్కర్‌ దళితుల స్థితిగతులను మెరుగుపరచడానికి తుదివరకు పోరాటం సాగించారు.

బాల్యంలో చేదు అనుభవాలు
అంబేద్కర్‌ తండ్రి రామ్‌జీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. చివరకు సతారాలోని ఒక ఉపాధ్యాయుడు వారిని తన క్లాసుకు రానిస్తానని ఒప్పుకున్నాడు. దాంతో రామ్‌జీ తన కుటుంబాన్ని సతారాకు తరలించారు. అంబేద్కర్, ఆయన అన్న ఆనందరావు సతారాలోని స్కూల్‌లో చేరారు. క్లాసులో ఒక మూలగా గోనెగుడ్డలు పరుచుకుని కూర్చునేవారు. తోటి పిల్లలు వీరితో మాట్లాడేవారు కాదు. ఉపా«ధ్యాయులు వీరిని ప్రశ్నలు అడిగేవారు కాదు. నోట్సులు దిద్దేవారు కాదు. స్కూల్‌లో దాహం వేస్తే సైగ చెయ్యాలి. ఎవరైనా దయతలచి దూరం నుంచే నీరు ఎత్తి పోసేవారు. అంటరానితనంలోని అమానుషత్వం అప్పుడే అంబేద్కర్‌కు అర్థమైంది. అలాంటి రోజుల్లోనే అంబేద్కర్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌కు వేసవి సెలవులు ఇచ్చారు. గోరేగాంవ్‌లో ఉన్న తండ్రి దగ్గరకు అంబేద్కర్, అతని అన్న, మేనల్లుడు బయలుదేరారు. వీరి రాక గురించిన సమాచారం అందకపోవడంతో రామ్‌జీ స్టేషన్‌కు రాలేదు. చాలాసేపు ఎదురు చూసి, ఇక లాభంలేకపోవడంతో స్టేషన్‌ మాస్టర్‌ సాయంతో ఎడ్లబండిని మాట్లాడుకున్నారు. బండి కొంత దూరం పోయిందో లేదో బండివానికి వీరు అంటరానివారని తెలిసింది. వెంటనే అతను బండి ఆపేసి, బండీ ఎద్దులూ మైలపడిపోయాయని కేకలు వేస్తూ వీరిని బయటకు విసిరేశాడు. బయట ఎండ మండిపోతోంది. అప్పటికే పిల్లలు ముగ్గురూ బాగా అలసిపోయి ఉన్నారు. అంబేద్కర్‌ అన్న రెట్టింపు బాడుగ చెల్లిస్తామని ఆశపెట్టడంతో బండివాడు శాంతించాడు. అయితే, బండిని తాను తోలనన్నాడు. అంబేద్కర్‌ అన్న బండి తోలుతుంటే, పిల్లలిద్దరూ వెనుక కూర్చున్నారు. బండివాడు నడుచుకుంటూ బండిని అనుసరించాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నా తోవలో వాళ్లకు ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఎవరిని అడిగినా నీళ్లు లేవనేవారు. పక్కనే ఉన్న మురికి కాలువలోని నీళ్లు తాగమనేవారు. అంబేద్కర్‌ పసి మనసుపై ఈ సంఘటన బాగానే ప్రభావం చూపింది. అంబేద్కర్‌ జీవితంలో ఇలాంటి చాలా సంఘటనలే ఎదురయ్యాయి.

ఆదరించిన ఉపాధ్యాయుడు
బాల్యం నుంచి అంబేద్కర్‌లో సాహస ప్రవృత్తి ఎక్కువ. ఒకసారి చలిగాలులతో భోరున వర్షం కురుస్తోంది. గొడుగు లేకుండా స్కూలుకు వెళ్లాలని పందెం వేశారు తోటి పిల్లలు. అంతే, అంబేద్కర్‌ తన పుస్తకాల సంచి, గొడుగు అన్న చేతికి ఇచ్చి, తాను వర్షంలో తడుసుకుంటూనే స్కూలుకు బయలుదేరాడు. స్కూలుకు చేరే సరికి చిత్తుగా తడిసిపోయాడు. తల మీద నుంచి నీళ్లు కారుతున్నాయి. క్లాసు టీచరైన పెండ్సే అంబేద్కర్‌ పరిస్థితి చూసి చలించిపోయాడు. బ్రాహ్మణుడే అయినా ఆయన కాస్త మంచివాడు. వెంటనే తన కొడుకుని పిలిచి, అంబేద్కర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లి వేణ్నీళ్ల స్నానం చేయించి, తడి బట్టలు ఆరవేసి, పొడిబట్టలు ఇవ్వమని చెప్పాడు. ఆ ఉపాధ్యాయుని ఆదరణను, తనపై చూపిన ఆప్యాయతను అంబేద్కర్‌ ఎప్పుడూ మరువలేదు. అంబేద్కర్‌పై ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. స్కూలు రికార్డుల్లో భీమ్‌రావుగా ఉన్న పేరును భీమ్‌రావు అంబేద్కర్‌గా నమోదు చేసిన ఉపాధ్యాయుడు ఆయనే. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూనే, కొందరు దయామయుల సహాయ సహకారాలతో అంబేద్కర్‌ 1907లో మెట్రిక్‌ పూర్తి చేశాడు. అంబేద్కర్‌ మెట్రిక్‌ ఉత్తీర్ణుడవడంతో అతని కులం వారంతా సంతోషించారు. ప్రముఖ సంఘ సంస్కర్త ఎస్‌.కె.బోలే అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న ప్రసిద్ధ మరాఠీ రచయిత, సంస్కర్త కృష్ణాజీ అర్జున్‌ తాను రచించిన ‘గౌతమబుద్ధ చరిత్ర’ను అంబేద్కర్‌కు బహూకరించారు. బుద్ధుని సామాజిక ధర్మం ఆ వయసులోనే అంబేద్కర్‌కు అవగతమైంది.

ఉన్నత విద్యా ప్రస్థానం
మెట్రిక్‌ పూర్తయిన కొద్ది రోజులకే అంబేద్కర్‌కు పెళ్లి జరిగింది. బాల్య వివాహాలు జరిగే ఆ కాలంలో తొమ్మిదేళ్ల రమాబాయితో ఆయన పెళ్లి జరిగింది. ఉన్నత చదువుల కోసం అంబేద్కర్‌ ఎల్ఫిన్‌స్టన్‌ కాలేజీలో చేరాడు. అనారోగ్యం కారణంగా ఒక ఏడాది చదువుకు ఆటంకం కలిగింది. అదే సమయంలో తండ్రి రామ్‌జీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అంబేద్కర్‌ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కేలూస్కర్‌ బాసటగా నిలిచాడు. అంబేద్కర్‌ను బరోడా మహారాజు దగ్గరకు తీసుకుపోయాడు. ‘అర్హులైన నిమ్నజాతీయులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాను’ అంటూ బొంబాయి సమావేశంలో ఆయన అన్న మాటలను గుర్తు చేస్తూ, అంబేద్కర్‌ను పరిచయం చేశాడు. బరోడా మహారాజు వెంటనే అంబేద్కర్‌కు నెలకు పాతిక రూపాయల ఉపకార వేతనాన్ని ఏర్పాటు చేశాడు. అంబేద్కర్‌ 1912లో బీఏ పూర్తి చేశాక కొంతకాలం బరోడా సంస్థానంలో ఉద్యోగం చేశాడు. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలోని కొలంబియా వర్సిటీలో చేరాడు.  స్వదేశానికి వచ్చాక బరోడా సంస్థానంలో పదేళ్లు ఉద్యోగం చేయాలనే షరతులపై బరోడా మహారాజు అంబేద్కర్‌కు ఆర్థిక సాయం చేశారు. కొలంబియా వర్సిటీ నుంచి అంబేద్కర్‌ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, డాక్టరేట్‌ పూర్తి చేశారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక 1917లో అంబేద్కర్‌ తిరిగి భారత్‌ చేరుకున్నాడు. బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. ఒక దళితుడు విదేశాల్లో చదువుకుని ఉన్నత ఉద్యోగంలో చేరడాన్ని సంస్థానంలోని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కింది ఉద్యోగులు సైతం ఫైళ్లను ఆయన బల్లపై ఎత్తి వేసేవారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్‌ ఎక్కువ సమయం సంస్థాన గ్రంథాలయంలో గడిపేవారు. అదేకాలంలో కొల్హాపూర్‌ మహారాజు సాహూ మహారాజు అస్పృశ్యత నిర్మూలన కోసం కృషి సాగిస్తుండేవారు. ఆయన ఆధ్వర్యంలోని ‘మూక నాయక్‌’ పక్షపత్రికకు అంబేద్కర్‌ సంపాదకత్వం వహించేవారు. సాహు మహారాజు అంబేద్కర్‌ తిరిగి విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక సాయం చేశారు. ఆయన సాయంతో విదేశాలకు వెళ్లిన అంబేద్కర్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి కూడా ఎంఏ, డీఎస్సీ పూర్తి చేశారు. లండన్‌లో బార్‌ ఎట్‌ లా పూర్తి చేశాడు. కొలంబియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌డీ పట్టా సాధించి, తిరిగి స్వదేశానికి వచ్చారు.

కులవివక్షపై పోరాటం
స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేద్కర్‌ కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆయన 1927లో  ‘బహిష్కృత భారతి’ అనే మరాఠీ పక్షపత్రికను ప్రారంభించారు. అందులోని ఒక వ్యాసంలో ‘‘తిలక్‌ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, జన్మహక్కు అని ప్రకటించి ఉండేవాడు’’ అని రాశారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్‌ సాగించే జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ అస్పృశ్యతా నిర్మూలన కోసం సాగించిన కృషికి నాటి కాంగ్రెస్‌ నేతల నుంచి పూర్తి మద్దతు ఉండేది కాదు. గాంధీ దళితులను చూసిన కోణం వేరు. ఆయన వర్ణ వ్యవస్థను వ్యతిరేకించలేదు. వర్ణ వ్యవస్థ భారత దేశానికి గల ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉందని సమర్థించారు. అయితే, అంటరానివారుగా ఉన్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం బాగు కోసం తమ వృత్తులను చేస్తున్నారని, అలాంటి వారిని ఇతర వర్ణాల వారందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయంగా అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని అంబేద్కర్‌ భావించారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించి బ్రిటిష్‌ ప్రభుత్వం 1930, 31, 32 సంవత్సరాలలో నిర్వహించిన మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లోనూ అంబేద్కర్‌ పాల్గొన్నారు. రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు గాంధీ కాంగ్రెస్‌ ప్రతినిధిగా హాజరయ్యారు. ఆ సమావేశంలోనే గాంధీకి, అంబేద్కర్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్‌ పట్టుబడితే, అలా చేయడం వల్ల హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందంటూ గాంధీ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గాంధీ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం తర్వాత 1932లో రామ్సే మెక్‌డొనాల్డ్‌ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదిస్తూ ‘కమ్యూనల్‌ అవార్డు’ను ప్రకటించాడు. అప్పటికి ఎరవాడ జైలులో ఉన్న గాంధీ, ఈ ప్రకటన తెలిసిన వెంటనే జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనివల్ల అంబేద్కర్‌పై నైతిక ఒత్తిడి పెరగడంతో ఆయన గాంధీతో పూనా ఒప్పందానికి సిద్ధపడ్డారు. ఉమ్మడి నియోజకవర్గాల్లో ‘కమ్యూనల్‌ అవార్డు’ కంటే ఎక్కువ స్థానాలను దళితులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. గాంధీ అంటరానితనం నిర్మూలన కోసం చేపట్టిన ఉద్యమంలో అంబేద్కర్‌ను భాగస్వామిగా చేసినా, గాంధీ విధానాలతో పొసగక అంబేద్కర్‌ బయటకు వచ్చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌ వంటి సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. అదే కాలంలో క్విట్‌ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశానికి విభజనతో కూడిన స్వాతంత్య్రం వచ్చాయి.

అంబేద్కర్‌ సూక్తులు
►మనిషికీ మనిషికీ మధ్యనున్న  అసమానత్వమే అన్ని బాధలకూ మూలం.

►గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సద్వర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.

►పుసక్తాలు దీపాల వంటివి. వాటిలోని   వెలుతురు మనలోని అజ్ఞానాంధకారాన్ని   తొలగిస్తుంది.

►కేవలం పుస్తకాలను చదివి వదిలేస్తే ఏముంది? చెదపురుగులు కూడా  పుస్తకాలను నమిలేస్తాయి. అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్లేనా?

►కులం పునాదుల మీద దేనినీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని    నిర్మించలేరు.

►రాజ్యాంగం దుర్వినియోగమైనట్లు తెలిస్తే, దానిని తగులబెట్టే తొలి వ్యక్తిని నేనే.

►మేధస్సుకు పదును పెట్టడమే మనిషి  అస్తిత్వానికి పరమార్థం.

►స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్నే నేను ఇష్టపడతారు.

►సామాజిక స్వేచ్ఛను సాధించనంత వరకు చట్టం కల్పించిన స్వేచ్ఛ మీకు అందదు.

►రాజకీయ నియంతృత్వాన్ని సామాజిక నియంతృత్వంతో పోల్చలేం. ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కంటే, 
    సమాజాన్ని ఎదిరించే సంస్కర్తే ధైర్యశాలి.

►ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోదలచిన వారు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎంతటి మహాత్ముల వద్దనైనా వదులుకోరాదు.

►ఒక వర్గాన్ని మరో వర్గంపైకి ఉసిగొలిపే ధోరణి ప్రమాదకరం.

►నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ తలెత్తితే, ముందు నేను నా జాతి సమస్యలకే ప్రాధాన్యమిస్తాను. 

►దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.

►నీ కోసం జీవిస్తే, నీలోనే మిగిలిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.

► మండిన కొవ్వొత్తి మనది కానట్లే, గడిచిన కాలమూ తిరిగి రాదు.

రాజ్యాంగ రచన
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మనదైన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగ రచన కోసం ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే, దాదాపు మొత్తం రాజ్యాంగ రచనా భారాన్ని అంబేద్కరే నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు సమావేశంలోఅప్పటి కేంద్ర మంత్రి టి.టి.కృష్ణమాచారి మాట్లాడుతూ, ‘‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. మిగిలిన ఒకరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యంగ రచనా భారమంతా అంబేద్కర్‌ ఒక్కరే మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో సందేహం లేదు.’’ అన్నారు. అంబేద్కర్‌ కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా, 1951లోనే ఆ పదవికి రాజీనామా చేశారు.

బౌద్ధమత స్వీకారం
అంబేద్కర్‌ మొదటి భార్య రమాబాయి 1935లో మరణించారు. తర్వాత ఆయన తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్‌ను పెళ్లాడారు. జీవిత చరమాంకంలో 1956 అక్టోబర్‌ 14న అంబేద్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంతకు చాలాకాలం ముందే ఆయన ‘నేను హిందువుగా పుట్టినా, హిందువుగా మాత్రం మరణించను’ అని ప్రకటించారు. బౌద్ధం ఈ దేశ సంస్కృతిలో భాగమేనని, తన మత మార్పిడి వల్ల దేశ చరిత్రకు, సంస్కృతికి ఎలాంటి భంగం కలగకుండా చూశానని చెప్పుకున్నారు. బౌద్ధం స్వీకరించిన కొద్ది కాలానికే, 1956 డిసెంబర్‌ 6న అంబేద్కర్‌ కన్నుమూశారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, ఆర్థిక, న్యాయ నిపుణుడిగా ఆయన చేసిన నిరుపమానమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించింది. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top