ఏకపక్ష నివేదికతో ఎవరికి మేలు?

IYR Krishna Rao Article On Pawan Kalyan Fact Finding Committee - Sakshi

విశ్లేషణ

కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాల్ని పొందుపరచకుండా ఏపీకి కేంద్రం నుంచి 85 వేల కోట్లు రావాలంటూ లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ ఎన్నికల ముందు ఒక నివేదిక ఇవ్వడం కొన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించటమే అవుతుంది. జేపీ నిపుణుల కమిటీ నివేదిక విడుదల సమయాన్ని చూస్తే తెలియకుండానే వారు ఒక రహస్య ఎజెండాకు దోహదం చేశారా అని అనుమానమేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కమిటీ నివేదిక తయారైంది. ఏపీకి చెందిన అన్ని అంశాల్లో కేంద్రాన్ని దోషిగా చూపెట్టడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఊతమిచ్చే రిపోర్ట్‌ గానే ఇది మిగిలిపోతుంది.

పవన్‌ కళ్యాణ్‌ నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టును విడుదల చేసి ఈ మార్చి నెలకు సరిగ్గా ఒక సంవత్సరం. ఆ రిపోర్టు విడుదలైన వెంటనే జయప్రకాష్‌ నారాయణ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కొంతమంది నిపుణులతో మరి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పడిన తొలి రోజులలో కమిటీ కార్యక్రమాలకు ప్రసార మాధ్యమాలలో విస్తృత ప్రచారం లభించింది. కానీ ఆ పైన ఈ కమిటీ ఏం చేస్తోంది అనేది చాలా గోప్యంగా ఉంచారు. సరిగ్గా పది నెలల తరువాత ఒక వారం క్రితం జేపీ విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి 85 వేల కోట్లు రావాలని ప్రకటించేవరకు ఈ పది నెలల కాలం ఈ కమిటీ ఏం చేస్తున్నది ఎవరికీ తెలియదు. కమిటీలో ఉన్న వారందరూ వివాద రహితులు వారి వారి రంగాలలో నిష్ణాతులు. కానీ ఈ కమిటీ నివేదిక విడుదల చేసిన సమయాన్ని, విధానాన్ని బట్టి చూస్తే వారికి తెలియకుండానే వారు ఒక రహస్య ఎజెండాకు  దోహదం చేశారా అని అనుమానం కలుగక మానదు.

పవన్‌ కళ్యాణ్‌ ఏర్పాటుచేసిన నిజ నిర్ధారణ కమిటీలో చర్చల సందర్భంగా ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కమిటీకి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సమాచార హక్కుల చట్టం క్రింద ఒక పత్రం సమర్పించడం తప్పితే,  కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకురావటానికి కానీ సంప్రదింపులు జరపటానికి కానీ కమిటీ పెద్దగా కృషి చేయలేదు. అటువంటి పరిస్థితులలో కమిటీ నివేదికలో ఈ మొత్తాలు కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాలుగా చూపెట్టడం భావ్యం కాకపోవచ్చని నేను పేర్కొన్నాను. ఈ వాదనను కమిటీ అంగీకరించి తదనుగుణంగా నివేదికలో ఈ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన నిధులుగా పొందుపరచడ మైంది. ఇదే అంశాన్ని ఆరోజు విలేకర్ల సమావేశంలో కూడా నేను ప్రస్తా వించాను. కానీ, జేపీ ఇవి కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాలుగా పేర్కొ నటంతో ఆ నివేదికలో పొందుపరచిన అంశాలకు భిన్నంగా ఆ అభి ప్రాయం జనబాహుళ్యంలోకి వెళ్ళింది.

ఈ అంశం ఈ నిపుణుల కమిటీ నివేదికకు కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యంతో వర్తిస్తుంది. నిపుణుల కమిటీ తన అధ్యయనాన్ని పది నెలల సుదీర్ఘ కాలం కొనసాగించింది. ఈ సమయంలో కేంద్ర ప్రభు త్వాన్ని  వారి విధానాన్ని కూడా తెలియజేయవలసిందిగా కమిటీ కోరి ఉండి ఉంటే వారి అభిప్రాయాలు కూడా కమిటీ పరిశీలించి తమ నివేదికలో పొందుపరిచే అవకాశం ఉండి ఉండేది. అప్పుడు కమిటీ నివేదికకు విశ్వసనీయత ఉండేది.అటువంటి ప్రక్రియ కమిటీ చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని మూలంగా తీసుకొని కమిటీ తన నివేదికను తయారుచేసింది. ఇటువంటి ఏకపక్ష నివేదిక వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండక పోవచ్చు.ఇక రెండవ అంశం జేఎఫ్‌ఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన కొన్ని రోజులకే ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. పరిశీలించవలసిన అంశాలు క్లిష్టమైనవీ, బహుళమైనవీ కావు. రెండు మూడు నెలలలోపు ఈ కమిటీ రిపోర్టు వచ్చి ఉంటే దీని మీద నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఉండేది. కానీ, ఎన్నికల ముందు కేంద్ర ప్రభు త్వాన్ని సంప్రదించకుండా వారి అభిప్రాయాల్ని పొందుపరచకుండా కేంద్రం నుంచి 85 వేల కోట్లు రావాలంటూ ఒక నివేదిక ఇవ్వడం కొన్ని  రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించటమే అవుతుంది.

ఇక కమిటీ నివేదికలోని ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే చాలా అంశాల్లో స్పష్టత హేతుబద్ధత కనిపించటం లేదు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కమిటీ ప్రస్తావించ లేదు. ఈ విధంగా ఒక ప్రధానమైన, రాష్ట్రంలో ఆవేశపూరితంగా మారిన ఒక అంశంపై కమిటీ నివేదిక నీళ్లు చల్లినట్లయింది. ప్రత్యేక సహాయాన్ని గురించి ప్రస్తావిస్తూ రూ.16,447 కోట్ల మొత్తాన్ని ఈఏపీ స్కీమ్‌ల ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, ఈ సహాయాన్ని ఇవ్వటానికి ఇతర మార్గాలు అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంలో నిధులు ఇవ్వటానికి ప్రత్యా మ్నాయ మార్గాలు అన్వేషించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని భీష్మించుకుని కూర్చొని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆవిధంగా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి రావాల్సిన నిధు లుగా చూపెట్టడంలో అర్థం లేదు. ఈ మొత్తాన్ని రాష్ట్రం తీసుకోవడానికి ఇష్టపడని మొత్తంగా చూపెట్టాల్సి ఉంటుంది.

ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ గురించి పేర్కొంటూ బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ తరహాలో కేంద్ర ప్రభుత్వం రూ. 24,350 కోట్లు ఇవ్వాలని సూచించింది. అయితే బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలో.. అప్పటికే అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకం లాంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు భాగంగా చేయడం జరిగింది. ఆ మొత్తాన్ని తొలగించిన తర్వాత చేసిన ఎటువంటి పోలిక అయినా సమంజసంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్యాకేజీలోనూ  కేటాయింపులకు, చివరికి ఇచ్చే విడు దల మొత్తాలకు వ్యత్యాసాలు ఉంటాయి. మనకు జిల్లాకు 50 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం వచ్చిందీ విడుదలైన మొత్తాలూ. వీటిని పోల్చాలి అంటే బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలో కూడా మిగిలిన పథకాలలోని మొత్తాలను మినహాయించిన తర్వాత విడుదలైన నిధులను తీసుకొని పోలిక చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ 13 జిల్లాలకు వర్తిస్తుంది. మన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ 7 జిల్లాలకే వర్తిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజీని పేర్కొని రూ. 24 వేల కోట్ల దాకా రావాల్సి ఉంటుందని పేర్కొనడం సరైంది కాకపోవచ్చు.

ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చించేటప్పుడు కమిటీ మరో ప్రధాన అంశాన్ని ప్రస్తావిం చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనే వాస్తవాన్ని పేర్కొంటూ రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య కోస్తా ప్రాంతానికి సమానంగా అభివృద్ధి చెందాలంటే బయట నుంచి వచ్చే పెట్టుబడిలో 85 శాతం ఈ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. అలాంటప్పుడు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృతంగా మొత్తం పెట్టుబడులను రాజ ధాని ప్రాంతంలోనే చేయడాన్ని కమిటీ ప్రస్తావించలేదు ప్రశ్నించలేదు. 85 శాతం కొత్తగా వచ్చే పెట్టుబడులన్నీ వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లా లని అన్నప్పుడు అది కేవలం కేంద్రం నుంచి వచ్చే సహాయంతోనే జర గదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను పెట్టే పెట్టుబడులను ఒక ప్రణాళిక ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశాన్ని ఎందుకనో కమిటీ పూర్తిగా విస్మరించింది. ఇక 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ లోటు విషయంలో ఆ సంవత్సరం కాగ్‌ నిర్ధారించిన మొత్తం రూ. 16 వేల 78 కోట్లు.

దీనికి అదనంగా 2015–16 సంవత్సరంలో అయిన ఖర్చు రూ. 6,800 కోట్లు కలిపి మొత్తం రూ. 23 వేల కోట్ల దాకా 2014–15 సంవ త్సరం లోటుగా తేల్చి, దానిలో రూ. 10,300 కోట్ల దాకా ఇంతవరకు భర్తీ చేసిన మొత్తంతో కలిపి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని కమిటీ సూచించడం జరిగింది. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. కమిటీ ఈ అంశంమీద కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక పరిశ్రమల కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉండ టంతో భవిష్యత్తులో కట్టవలసిన పన్నులు అక్కడ కట్టడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని రూ. 3,800 కోట్లుగా నిర్ధారించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ తప్పకుండా రావాల్సినటువంటి మొత్తం. కానీ ఇంతవరకు ఈ మొత్తాన్ని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్రాన్ని అడగలేదు. కేవలం చట్టాన్ని సవరించాలని మాత్రమే కోరింది. సవరణ సాధ్యం కాదని కమిటీ తేల్చినందువలన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లిం చవలసిందిగా రాష్ట్రం కేంద్రాన్ని అభ్యర్థిస్తే బాగుంటుంది.

పోలవరం విషయంలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచా రాన్ని విశ్లేషించకుండా నమ్మి నివేదికను రూపొందించింది. 2019 సంవ త్సరానికి 41 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని కమిటీ ఎట్లా నమ్మిందో అర్థం కావటం లేదు. మొదటి నాలుగేళ్లు పని మందకొడిగా నడవడానికి కారణాలు, అనూహ్యంగా అంచనాలు పెంచ డానికి  కారణాలను కొంత లోతుగా అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు కేంద్రానికి కొత్త కాదు. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన దానికన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంలో అలసత్వం ఉందా అనే అంశాన్ని పరిశీలించి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేది. ఆ పని చేయకుండా కొన్ని సంవత్సరాల్లో రావాల్సిన మొత్తం అంతటిని గంపగుత్తగా ఒకేసారి రావాలి అనేవిధంగా నివేదికలో రూపొందించటం కేవలం వాస్తవాలను వక్రీకరించడమే. ఇక రాజధాని అంశాన్ని వివిధ మౌలిక సదుపాయాల కల్పనను కమిటీ ప్రస్తావించింది. గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా కేంద్రాన్ని దోషిగా చూపెట్ట డమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రం వైఖరి ఆ విధంగా  ఉన్న ప్పుడు ఈ నివేదిక సమస్య పరిష్కారానికి తోడ్పడదు. కేంద్రాన్ని దోషిగా చూపెట్టడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఊతమిచ్చే రిపోర్ట్‌ గానే ఇది మిగిలిపోతుంది.

ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top