అత్యాచార నిందితునికి పోలీసుల దేహశుద్ధి
సోషల్ మీడియాలో వీడియో వైరల్
కలికిరి (చిత్తూరు జిల్లా): కలికిరి మండలంలోని పత్తేగడ గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటన నిందితుడు వీరభద్రయ్యకు పోలీసులు దేహశుద్ధి చేస్తున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నెల 23 రాత్రి ఆరో తరగతి విద్యార్థినిపై వీరభద్రయ్య(25) అత్యాచారానికి పాల్పడడం తెలిసిందే. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు.
అతను పారిపోవడానికి యత్నించడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే పోలీసులు నిందితుడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగింది. వీరభద్రయ్యకు కఠిన శిక్ష పడేలా పోలీసు చర్యలు తీసుకోవాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ను మంగళవారం కలిసి విన్నవించారు. వీరభద్రయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు మంగళవారం స్థానిక పాఠశాల నుంచి పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.