తెలుగుదేశం పార్టీ రేషన్‌ దుకాణం! | Ration Shops Under TDP Government Prakasam | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీ రేషన్‌ దుకాణం!

Apr 23 2018 11:13 AM | Updated on Apr 23 2018 11:13 AM

Ration Shops Under TDP Government Prakasam - Sakshi

 చౌకధరల దుకాణం

మార్కాపురం : పశ్చిమ ప్రకాశంలోని 12 మండలాల్లో ఉన్న రేషన్‌ దుకాణాల్లో బినామీ డీలర్లు హవా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్న డీలర్లపై ప్రథకం ప్రకారం వేటు వేస్తూ వచ్చారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రతిపక్ష పార్టీ మద్దతు డీలర్లు రాజీనామా బాట పట్టేలా చేశారు. డివిజన్‌లో మొత్తం 438 రేషన్‌ దుకాణాలు ఉండగా 1, 81, 232 రేషన్‌కార్డులు ఉన్నాయి. టీడీపీ నేతలు, అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మొత్తం ఇప్పటి వరకు 70 మంది డీలర్లు రాజీనామా చేశారు.

వీటిని భర్తీ చేయాల్సిన అ«ధికారులు కాలక్షేపం చేస్తూ పొదుపు సంఘాల పేరుతో టీడీపీ నేతలకు షాపులు కట్టబెడుతున్నారు. వారు ఆడిందే ఆట..పాడిందే పాటలాగా.. రేషన్‌ ఇస్తేనే కార్డుదారులు నిత్యవసరాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల వేధింపులు ఎదుర్కొన్న వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు సుమారు 25 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసి టీడీపీ మద్దతుదారులకు రేషన్‌ షాపులు కట్టబెట్టారు. రికార్డుల్లో మాత్రం షాపులు పొదుపు సంఘాల మహిళలు నిర్వహిస్తున్నట్లు చూపుతున్నారు. వాస్తవంగా షాపులు నిర్వహించేది మాత్రం టీడీపీ మద్దతుదారులే కావడం గమనార్హం.  

ఇవిగో..అక్రమాలు
దోర్నాల మండలం కటకానిపల్లె, కడపరాజుపల్లి, ఐనముక్కల, గంటవారిపల్లె, బోడెనాయక్‌ తండా, దోర్నాల 15, 16, 26 షాపులు, చింతల అగ్రహారం డీలర్లను భర్తీ చేయాల్సి ఉంది. పెద్దారవీడు మండలం ఎస్‌.కొత్తపల్లె, కలనూతల, గొబ్బూరు, బి.చెర్లోపల్లె, దేవరాజుగట్టుల్లో రేషన్‌షాపులు ఖాళీగా ఉన్నాయి. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు, బేస్తవారిపేట, కంభం మండలం కందులాపురం, రావిపాడు, ఎర్రబాలెం, తురిమెళ్ల, నర్సిరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో షాపులు ఖాళీగా ఉన్నాయి.

గిద్దలూరు మండలం ముండ్లపాడు, సూరేపల్లె, సంజీవరావుపేట, కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లె, మార్కాపురంలో మార్కాపురం 21, మిట్టమీదపల్లె, గొట్టిపడియ, తిప్పాయపాలెం, జమ్మనపల్లి, కొండేపల్లి, గజ్జలకొండ 1, 2, బోడపాడు, నాయుడుపల్లె, పెద్దయాచవరం, భూపతిపల్లె 2లో ఖాళీలు ఉన్నాయి. పుల్లలచెరువు మండలం అక్కపాలెం, నాయుడుపాలెంలో 2, సిద్ధినపాలెం, ఐటీవరం, అయ్యవారిపల్లె, సింగుపల్లి, మానేపల్లి, నరజాముల తండాల్లో షాపులు ఖాళీగా ఉన్నాయి.

త్రిపురాంతకం మండలం టి.చెర్లోపల్లె, గణపవరం, ఎండూరివారిపాలెం, జి.ఉమ్మడివరం, కంకణాలపల్లె, మిరియంపల్లి, రామసముద్రం, లేళ్లపల్లి, నడిగడ్డ డీలర్‌షిప్‌లు భర్తీ చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లి, యర్రగొండపాలెం 5, 21, గోళ్లవీడిపి, సర్వాయపాలెం, గంజివారిపల్లె, గురిజేపల్లి, కొలుకుల, చిన్నబోయలపల్లె, గంగపాలెం, యర్రగొండపాలెం 22, 11 స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి. మరికొంత మంది డీలర్లపై అధికారులు 6ఏ కేసులు నమోదు చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వీరి స్థానంలో పొదుపు సంఘాల సభ్యులను ఇన్‌చార్జిలుగా నియమించారు.

రాజీనామా చేసిన డీలర్లు 90 శాతం మంది విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. వీరిని ఎదిరించిన డీలర్లపై రెవెన్యూ అధికారులు 6ఏ కేసులు, మరీ లొంగకుంటే పోలీసు కేసులు కూడా పెట్టారు. బినామీ డీలర్లు కావడంతో అధికారులు గట్టిగా చెప్పలేకపోతున్నారు. వినియోగదారులకు రేషన్‌షాపుల ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర సక్రమంగా లభించడం లేదు. మొత్తం మీద పశ్చిమ ప్రకాశంలో బినామీ డీలర్ల హావా కొనసాగుతోంది. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు వీటిని భర్తీ చేస్తే ప్రజలకు సక్రమంగా నిత్యావసరాలు అందే అవకాశం ఉంది. ఇటీవల త్రిపురాంతకం మండలంలో కొన్ని ఖాళీలను భర్తీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement