నాడు 9.. నేడు 3.. | Participants to the erosion of essential commodities in the white card | Sakshi
Sakshi News home page

నాడు 9.. నేడు 3..

Sep 13 2015 4:29 AM | Updated on Aug 10 2018 8:16 PM

రేషన్ దుకాణాల్లో సరుకులు లేక వెలవెలబోతున్నాయి. గతంలో అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల సరుకులను

తెల్లకార్డు దారులకు నిత్యావసర సరుకుల్లో కోత
ఏడాదిగా లభించని పామాయిల్

 
 ధర్మవరం : రేషన్ దుకాణాల్లో సరుకులు లేక వెలవెలబోతున్నాయి. గతంలో అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల సరుకులను రూ. 185లకే పేదలకు సరఫరా చేసేవారు. చక్కెర అరకిలో, కందిపప్పు అరకిలో, పామాయిల్ అరలీటర్, గోధుపిండి కిలో, ఉప్పు కిలో, చింత పండు అరకిలో, నెయ్యి 100 గ్రాములు, కారం పొడి 200 గ్రాములు, పసుపు 100 గ్రాముల చొప్పున తెల్లకార్డు దారులకు పంపిణీ చేసేవారు. ఇవి కాకుండా కిలో రూపాయి చొప్పున ఒక్కో లబ్ధిదారునికి నెలకు నాలుగు కిలోల  బియ్యం, కిరోసిన్ కూడా ఇచ్చేవారు. ప్రస్తుతం సరుకుల సంఖ్య తగ్గింది.  మూడు రకాల సరుకులను మాత్రమే ఇస్తున్నారు.

 ఆహార భద్రత చట్టాన్ని అనుసరించి తెల్ల కార్డుల్లో పేర్కొన్న లబ్ధిదారులకు నెలకు ఐదు కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అలాగే పంచదార అరకిలో,  కిరోసిన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలుగా  గోధుమపిండి పంపిణీ నిలిపేశారు. పట్టణాల్లో తెల్లకార్డు దారులకు వంట గ్యాస్ కనెక్షన్ ఉంటే ఒక లీటరు, లేకపోతే నాలుగు లీటర్ల చొప్పున, గ్రామాల్లో అయితే  గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి లీటర్, లేని వారికి 2 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు.

అయితే.. రెండు నెలలుగా కిరోసిన్ కోటాను కూడా కుదించారు. నిబంధనల మేరకు పంపిణీ చేయాల్సిన దాంట్లో సగం మాత్రమే ఇస్తున్నారు.  ఒక్కో రేషన్ కార్డుపై కిలో కందిపప్పు రూ.50 చొప్పున చౌకదుకాణాల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా  పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫరా నిలిపి వేశారు. గతంలో రేషన్ షాపుల్లో లీటరు పామాయిల్ రూ.40కి లభించేది.

Advertisement
 
Advertisement
Advertisement