ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి అనంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు, కార్యదర్శి గ్యార పాండు మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెల 1న వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతనాలు గ్రీన్ చానల్ ద్వారా చెల్లించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నంబర్ 51ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనం తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. ప్రమాదం జరిగి మరణిస్తే రూ.20 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జగన్ పోల్కంపల్లి, పోచమోని కృష్ణ, కోశాధికారి దేవదాస్, శేఖర్, మాధవి, యాదయ్య, జగన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


