తల్లి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు
యాచారం: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆరోగ్యం బాగా లేక కొడుకుతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తూ తల్లి అనంతలోకాలకు వెళ్లగా, కొడుకు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. కందుకూరు మండలం బేగరికంచె గ్రామానికి చెందిన ఢిల్లీ భారతమ్మ (45), ఆమె కుమారుడు అఖిల్కుమార్ శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో మోటార్సైకిల్పై ఆకులామైలారం గ్రామానికి వచ్చారు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో అధిక బరువుతో వస్తున్న టిప్పర్ (టీజీ07ఎక్స్–1400) డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని వెనక్కు తీస్తూ ఢీకొట్టాడు. టిప్పర్ తల్లీకొడుకులపై నుంచి వెళ్లడంతో భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ అఖిల్కుమార్ను చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


