చేవెళ్ల: అభివృద్ధి కోసం అంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీలో చేరి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ నాయకుడు నాగేందర్గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవాబుపేట మండలం మలుమాడ గ్రామంలో జరిగిన ఇరువర్గాల దాడులు, 15 మందిపై కేసుల వెనుక ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రోద్భలం ఉన్నట్లుగా ఆయన వైఖరి తెలుస్తోందన్నారు. తన సొంత మండలంలో ఒక సర్పంచ్ వర్గం.. ఓడిపోయిన వర్గం మధ్య జరిగిన పసర్పసర దాడుల్లో ఇరువర్గాలకు నచ్చచెప్పి న్యాయం చేయాల్సింది పోయి ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. గాయపడిన వారిని వదిలేసి దాడిచేసిన వారి పక్షాన నిలబడి బెదిరింపులకుపాల్పడుతున్నాడని ఆరోపించారు. మాజీ మంత్రి సబితారెడ్డి మలుమాడ ఘటనపై స్పందించి ఇరువర్గాలను పరామర్శిచటానికి వస్తే ఆమె రావాల్సిన అవసరం ఏమందని ప్రశ్నించడం సిగ్గు చేటు అన్నారు. బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ వారిపై కేసులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే పార్టీ మారితే రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి చూపాలన్నారు. సత్తా ఉంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. కుటుంబ సభ్యులంతా పదవులు అనుభవించినా మండలానికి చేసిన అబివృద్ధి శూన్యమన్నారు. సబితారెడ్డిని గ్రామాలకు రావద్దనే అధికారం నీకు లేదని పార్టీ నాయకురాలుగా ఆమె అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీ శ్రేణులకు అండగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ శంకర్పల్లి, నవాబుపేట, చేవెళ్ల అధ్యక్షులు గోవర్ధన్రెడ్డి, దయాకర్రెడ్డి, పి.ప్రభాకర్, నాయకులు భరత్రెడ్డి, తలారి యాదయ్య, రవి, కృష్ణ, భాస్కర్రెడ్డి, రామగౌడ్, తదితరులు ఉన్నారు.
అభివృద్ధి సాకుతో అధికార పార్టీలోకి
కాలె యాదయ్య రాజీనాచేసి గెలవాలని
బీఆర్ఎస్ నాయకుల సవాల్


