● సొసైటీ గోదాంలకు తరలింపు
● మూడు నెలల పాటు నిల్వకు ఏర్పాట్లు
బషీరాబాద్: జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు(సొసైటీలు), మార్క్ఫెడ్ ద్వారా సేకరిస్తున్న ధాన్యం, మక్కలను బషీరాబాద్కు తరలిస్తున్నారు. రైస్ మిల్లులు ఇప్పటికే పూర్తిస్థాయిలో ధాన్యంతో నిండిపోవడంతో ప్రత్యామ్నాయంగా సొసైటీ గోదాంలు, సొసైటీ రైస్ మిల్లులను నిల్వ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. బషీరాబాద్ సొసైటీకి చెందిన గోదాం, రైస్మిల్లులో మొత్తం 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉండటంతో వివిధ మండలాల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. నావంద్గి, నవల్గా, మైల్వార్ కొనుగోలు కేంద్రాలతో పాటు యాలాల, ధారూరు మండలాల పరిధి సొసైటీలు, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన వరి, మక్కల బస్తాలను గోదాం, రైస్మిల్లులో నిల్వ చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన రక్షణ చర్యలతో పాటు గోదాంల వద్ద ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. ధాన్యం భద్రత కోసం సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో వాచ్మెన్ను నియమించినట్లు బషీరాబాద్ సొసైటీ సీఈఓ వెంకటయ్య తెలిపారు. మిల్లుల్లో ఖాళీ ఏర్పడే వరకు సుమారు మూడు నెలల పాటు ఈ గోదాంల లోనే ధాన్యం నిల్వ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.


