● పుష్కరకాలం మోదీ పాలన అమోఘం
● ఇంటింటి ప్రచారంలో బీజేపీ శ్రేణులు
తాండూరు టౌన్: పుష్కరకాలం మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్.. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలం అయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై విసుగు చెంది ఉన్నారని, రాబోయే కాలంలో బీజేపీకి పట్టం కట్టనున్నారని పేర్కొన్నారు. ఇందులో బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ గాజుల శాంత్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కో కన్వీనర్ భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షుడు మల్లేశం, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్, బండారి శ్రీకాంత్, దోమ కృష్ణ, బబ్లు తదితరులు పాల్గొన్నారు.


