బోనకల్లో విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం.. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం : డిప్యూటీ సీఎం భట్టి
బోనకల్/ఎర్రుపాలెం: ప్రతీ తెలంగాణ బిడ్డ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఎదగాలని.. తద్వారా అంతరాలు లేని ఆదర్శ సమాజం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్, ఎర్రు పాలెంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలు వురు విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువా రం ఆయన ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ద్వారా తేలిందన్నారు. ఈ మేరకు ప్రతీ బిడ్డ చదువుకునేలా ఏర్పాట్లు చేస్తుండగా..అర్ధాకలితో ఉంటే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివే 20 లక్షల మంది విద్యార్థులకు రానున్న జూన్ 2 నుంచి అల్పాహార పథకం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తా మని వెల్లడించారు. విద్య కోసం బడ్జెట్లో 13.5 శాతం నిధులు కేటాయించగా, ఆ నిధులు వృథా కావొద్దని అందరూ చదువుకునేలా సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధనకు రాష్ట్రంలో ఒకేసారి 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలి పారు. ఇవికాక రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించి సెమీ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తామని భట్టి వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు పనిచేసి వచ్చే సంపాదనతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బస్సుల్లో పంపిస్తున్నారని, తద్వారా వారి భారం పడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టు తెలి పారు. కాగా, జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా పథకం అమలు కానుందని భట్టి ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీసు కమిషనర్ సునీల్దత్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి, గిడ్డంగుల కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యం, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


