చైతన్యపురి: ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురై సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే వాటిని కొట్టేసింది అతడి కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు... కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో నివసించే దీపక్ పటేల్ టైల్స్ వ్యాపారి. జనవరి 28న భార్య వింధ్య పటేల్తో కలిసి ఇంట్లోని నగల బాక్సులను బెడ్ కింద ఉన్న లాకర్లో పెట్టి తాళం వేశారు. తాళం చెవులను బీరువా లాకర్లో భద్రపరిచారు.
గత శనివారం ఆభరణాల కోసం లాకర్ తెరిచి చూడగా ఖాళీ బాక్సులు దర్శనమిచ్చాయి. అవి చోరీకి గురై ఉంటాయని భావించి దీపక్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డీఐ గురుస్వామి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను విచారించగా ఈ ఘటనలో ఫిర్యాదుదారుడి కుమార్తె రియా హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతోంది. నమ్మకంగా ఉంటూ దీపక్ పటేల్ దగ్గర మేనేజర్గా పనిచేసే సాగర్(34)కు రియా ఆ ఆభరణాలను ఇచ్చినట్లు విచారణలో తేలింది.
బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్కు డబ్బులు అవసరమని అతడు నమ్మించి నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో కుటుంబం పరువు పోతుందని భావించిన ఫిర్యాదుదారుడు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కేసు వాపస్ తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని కొంత నగదు, బంగారం స్వా«దీనం చేసుకున్నామని చైతన్యపురి పోలీసులు తెలిపారు.


