పారిశుధ్య కార్మికులతో కేటీఆర్‌ భేటీ | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికులతో కేటీఆర్‌ భేటీ

Published Tue, Jan 2 2024 2:12 AM

Former Minister KTR Lunch with GHMC Sanitation Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు సోమవారం పారిశుధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్మికులతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. సెల్పిలు దిగారు. కాగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పారిశుధ్య కార్మికులు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఏళ్ల తరబడి చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని చెప్పారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కలి్పంచడంతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకూ మెడికల్‌ లీవ్‌ సౌకర్యం ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికులకు మూడు పర్యాయాలు వేతనం పెంచిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. సమస్యలను మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

నేతలు, కార్యకర్తల స్వాగతం 
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు, సెల్పిలు దిగారు. సుమారు ఐదు గంటల పాటు తెలంగాణ భవన్‌లో గడిపిన కేటీఆర్‌ కార్యకర్తలను కూడా కలిశారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రాజీవ్‌ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, టీఆర్‌ఎస్వీ నాయకులు శ్రీకాంత్‌ గౌడ్, తుంగ బాలు, కాటం శివ తదితరులు కేటీఆర్‌ను కలిశారు.

Advertisement
Advertisement