పాత చట్టం అయితే ఓకే | CM Revanth Reddy at a media conference in Delhi | Sakshi
Sakshi News home page

పాత చట్టం అయితే ఓకే

Apr 19 2026 6:06 AM | Updated on Apr 19 2026 6:06 AM

CM Revanth Reddy at a media conference in Delhi

బిల్లులో మార్పులు చేసి ప్రవేశపెట్టినా మేమంతా మద్దతిస్తాం 

సోమవారం బిల్‌ పాస్‌ చేసుకుని, మంగళవారం నుంచే అమలు చేయొచ్చు 

ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  

రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేతే బీజేపీ లక్ష్యం 

నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షంతో చర్చించాలన్న సీఎం 

బీజేపీతో కలిసిన వాళ్లకు వాళ్లే నష్టం చేస్తారని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును సోమవారం తిరిగి సభలో ప్రవేశపెడితే తమకు ఆమోదమే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అవసరమైతే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లులో మార్పులు చేసి ప్రవేశపెట్టినా ఇండియా కూటమితో సహా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సోమవారం బిల్‌ పాస్‌ చేసుకుని, మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘ఒక గంట సమయం ఇస్తే బిల్లులో మార్పులు చేసి తెస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సోమవారం వరకు ప్రస్తుతమున్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకు రావాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి రాజ్యాంగాన్ని మార్చుతామంటే దేశ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పార్లమెంట్‌లో ఓడిపోయింది మోదీ అహంకారమేనని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం విలేకరులతో మాట్లాడారు.  

అలాగైతే నేను దక్షిణాది రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడతా.. 
‘నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. నిపుణులతో చర్చించాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలి. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్‌ దగ్గర ఉన్నాయి. 2009లో డీలిమిటేషన్‌ జరిగింది. ఆ లెక్కలతో ఆగస్టు 15, 2026 లోపు మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించవచ్చు. ఆ రిజర్వేషన్లను ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే... తెలంగాణ సీఎంగా నేను బాధ్యత తీసుకుని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబునాయుడు, రంగసామిలతో చర్చలు జరుపుతా. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతా. 2023లో పాస్‌ అయిన బిల్లుకు ఒక చిన్న మార్పు చేసి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమే..’అని రేవంత్‌ స్పష్టం చేశారు. 

ప్రమాదకరమైన పునర్విభజనను అడ్డుకున్నాం.. 
‘దేశ భవిష్యత్తును, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చింది. దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయి. కేవలం ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజననే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని, మోదీ అహంకారాన్ని నిలువరించాయి. వాస్తవానికి ఎంపీ సీట్ల పెంపుతో ఎలాంటి లాభం లేదు. కేవలం పాలసీలు రూపొందించేందుకే రెండు సభలు ఉన్నాయి. దీనికన్నా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం ఉత్తమం. ఇందుకోసం 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. దేశానికి కాంగ్రెస్‌ మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని అందించింది. లోక్‌సభ స్పీకర్‌గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్‌ పార్టీ చేసింది. 

కానీ 1980లో ఏర్పడిన బీజేపీకి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరు. అడ్వాని, మురళీ మనోహర్‌ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారు. కానీ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు..’అని సీఎం చెప్పారు. తాను సూచించిన విధానం బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌కు నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలని అన్నారు. ‘తల్లిని చంపి.. బిడ్డను రక్షించారు..’అని మోదీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని, ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్‌ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బలహీనంగా ఉన్నప్పుడు కబ్జా చేస్తారు.. 
విలేకరుల సమావేశం అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా.. ‘బిల్లులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ పార్టీకీ రాజకీయంగా నష్టం చేకూరుతుందా?’అనే ప్రశ్నకు.. ‘ప్రభావం ఏమీ ఉండదు. సభలో నీళ్లకు నీళ్లు.. పాలకు పాలు తేలిపోయాయి. అదొక ముగిసిన అధ్యాయం. బీజేపీతో ఎవరు కలిసినా వారికి ఏదో ఒకరోజు వాళ్లే (బీజేపీ) నష్టం చేస్తారు. అందుకు నితీశ్‌కుమార్, ఏక్‌నాథ్‌ షిండే, నవీన్‌ పట్నాయక్‌లే ఉదాహరణ. వాళ్లు బలహీనంగా ఉన్నప్పుడు వీళ్లు కబ్జా చేస్తారు. మనం బలహీనపడ్డప్పుడు వాళ్లు మనల్ని తినేస్తారు..’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement