సూర్యాపేట అర్బన్ : వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారానికి సూర్యాపేట మున్సిపాలిటీ ఎంపికై ంది. ఈ పురస్కారాన్ని శుక్రవారం హైదరాబాద్లోని టీజీపీసీబీ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపల్ అధికారులకు అందజేయనున్నారు.
నేటి నుంచి పదో తరగతి
సప్లిమెంటరీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 5వ తేదీ (శుక్రవారం) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 186 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఏ విధమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి లేదన్నారు.
రాజకీయ కమిటీ
వైస్చైర్మన్గా ప్రభాకర్
కోదాడ, కోదాడ రూరల్ : ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా కోదాడ పట్టణానికి చెందిన ఓరుగంటి ప్రభాకర్ నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్లోని వాసవీభవన్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభాకర్కు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు.
నిరుద్యోగాన్ని అరికట్టడంలో ప్రధాని విఫలం
సూర్యాపేట అర్బన్ : దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని, వాటిని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పదేపదే భారతదేశంపై సుంకాలు విధిస్తున్నా.. వాటిని ప్రతిఘటించడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. పార్టీ జిల్లా శిక్షణ తరగతుల్లో మతోన్మాద విధానాలు– శాసీ్త్రయ ధృక్పథం అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి బోధించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా చలమల్ల
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ఉద్యమకారుల వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా చలమళ్ల నర్సింహ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ నరాల సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు.


