భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ పనుల తీరుపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైపులు, మ్యాన్న్ హోల్ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వి, నెలల తరబడి కాంక్రీట్ పనులు చేయకుండా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. తవ్వకాల సమయంలో దెబ్బతిన్న తాగునీటి పైపులైన్లు, ఇతర ప్రజా వినియోగ సదుపాయాలను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేసి, దెబ్బతిన్న మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో నల్లగొండ ప్రజారోగ్యశాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, మున్సిపల్ ఏఈ కిరణ్కుమార్, ప్రజారోగ్యశాఖ డిప్యూటీ ఏఈ అనిల్కుమార్, రమాదేవి, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


