పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ స్టార్ ఆల్రౌండర్ మొహ్మద్ నవాజ్ పట్టుబడ్డాడు. అతడు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది.
ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సుల్తాన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు నవాజ్ దూరం కానున్నాడు.
నవాజ్కు భారీ షాక్..
అదేవిధంగా నవాజ్కు మరో భారీ షాక్ తగిలింది. వాస్తవానికి నవాజ్ వచ్చే నెలలో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో సర్రే క్లబ్కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ అతడికి నిరభ్యంతర పత్రం (NOC) కూడా మంజారు చేసింది. కానీ ఈ వివాదం కారణంగా పీసీబీ ఎన్వోసీని నిలిపివేసినట్లు సమాచారం. కాగా నవాజ్ పాక్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.
భారత్, శ్రీలంక వేదికలగా జరిగిన టీ20 ప్రపంచకప్లో 7 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో నవాజ్కు ఘనమైన రికార్డు ఉంది. టీ20ల్లో పాకిస్తాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నవాజ్(101) నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌలర్ కూడా నవాజ్నే కావడం గమనార్హం. ఒకవేళ విచారణలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. కాంట్రాక్ట్ రద్దుతో పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
చదవండి: IPL 2026: సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?


