క్రిస్‌ గేల్‌ విధ్వంసం.. లేటు వయసులోనూ తగ్గని యూనివర్సల్‌ బాస్‌ | International Masters League 2025, Chris Gayle Blasting Innings Against England Masters, Check More Highlights Inside | Sakshi
Sakshi News home page

క్రిస్‌ గేల్‌ విధ్వంసం.. లేటు వయసులోనూ తగ్గని యూనివర్సల్‌ బాస్‌

Feb 27 2025 9:17 PM | Updated on Feb 28 2025 1:22 PM

International Masters League 2025: Chris Gayle Blasting Innings Against England Masters

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో (International Masters League 2025) ఇవాళ (ఫిబ్రవరి 27) వెస్టిండీస్‌ మాస్టర్స్‌, ఇంగ్లండ్‌ మాస్టర్స్‌ జట్లు తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (Chris Gayle) చెలరేగండతో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 

గేల్‌తో పాటు మరో ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ , నర్సింగ్‌ డియోనరైన్‌, ఆష్లే నర్స్‌ కూడా చెలరేగారు. గేల్‌ 19 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గేల్‌ పాత రోజులను గుర్తు చేశాడు. లేటు వయసులోనూ విధ్వంసం సృష్టించాడు. డ్వేన్‌ సైతం వేగంగా పరుగులు సాధించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. 

డియోనరైన్‌ 23 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ఆష్లే నర్స్‌ 13 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ ఎడ్వర్డ్స్‌ 9, చాడ్విక్‌ వాల్టన్‌ 9, దినేశ్‌ రామ్‌దిన్‌ 8, జెరోమ్‌ టేలర్‌ ఒక్క పరుగు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మాంటీ పనేసర్‌ 3 వికెట్లు తీయగా.. క్రిస్‌ స్కోఫీల్డ్‌ 2, క్రిస్‌ ట్రెమ్లెట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కాగా, ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో 6 దేశాలకు (భారత్‌, శ్రీలంక. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్‌కు సచిన్‌, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్‌ లారా, ఆస్ట్రేలియాకు షేన్‌ వాట్సన్‌, సౌతాఫ్రికాకు జాక్‌ కల్లిస్‌, ఇంగ్లండ్‌కు ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహిస్తున్నారు. 

భారత మాస్టర్స్‌ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్‌ ఆటగాళ్లు పాల్గొననున్నారు.

ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ అత్యధిక మ్యాచ్‌లు గెలిచింది. భారత మాస్టర్స్‌.. శ్రీలంక, ఇంగ్లండ్‌ మాస్టర్స్‌పై విజయాలు సాధించారు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్‌పై విండీస్‌.. సౌతాఫ్రికా మాస్టర్స్‌పై శ్రీలంక మాస్టర్స్‌ విజయాలు సాధించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement