బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ కల్కాల్ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్ సింగ్ మాన్ (79 కేజీలు) రజతం... అంకుశ్ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు.
ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్ 2019లో బజరంగ్ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్గా అవతరించిన భారత రెండో రెజ్లర్గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్ ఒచిర్ (మంగోలియా)పై గెలుపొందాడు.
79 కేజీల ఫైనల్లో సందీప్ సింగ్ 1–2తో కీవన్ ఘరెదాగి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్లో అంకుశ్ 8–2తో ఫుగా ససాకి (జపాన్)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్లో విక్కీ 5–7తో షెర్జాద్ పొయోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది.
61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్లో అమన్ 11–9తో అహ్మద్ (ఇరాన్)పై, ముకుల్ 12–6తో బొలాత్ సకాయెవ్ (కజకిస్తాన్)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్ 0–2తో షరిపోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు.


