టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చేరాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ గెలవడంతో సూర్యకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
మరోవైపు.. ఈ విజయంతో హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిపించిన గౌతీ.. తాజాగా సూర్యతో కలిసి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు.
ఒకటీ రెండు విషయాల్లో విభేదాలు
ఈ నేపథ్యంలో గౌతం గంభీర్తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఆలోచనలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని తెలిపాడు. అయితే, ఒకటీ రెండు విషయాల్లో తమ మధ్య విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అయినా.. అవి అంతగా పట్టించుకోదగ్గ విషయాలు కావని పేర్కొన్నాడు.
వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. ‘‘జట్టును ఎంపిక చేసే సమయంలో 15 మంది పేర్లలో పద్నాలుగు మేమిద్దరం కలిసి చెప్పినవే ఉంటాయి. మేము ఒకే విధంగా ఆలోచిస్తున్నామనడానికి ఇది నిదర్శనం.
చర్చ మాత్రమే ఉంటుంది
మా లక్ష్యాలు కూడా ఒక్కటే. అందుకే ఆ ఒక్క పేరు విషయంలో మా మధ్య వాదనలు కాకుండా చర్చ మాత్రమే ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇప్పటికీ తాను గంభీర్ను గౌతీ భాయ్ అనే పిలుస్తానని.. తమది అన్నాదమ్ముల అనుబంధం అని తెలిపాడు.
పరిస్థితికి తగినట్లే
ఇక వరల్డ్కప్లో తాము ఆడిన విధానంపై స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఆడటానికి, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు హై రిస్కీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి అలాగే చేయలేము. పరిస్థితికి తగినట్లే ఆడి అనుకున్న ఫలితం రాబట్టడమే మా ప్రధాన లక్ష్యం’’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్


