టాప్‌-2లో ఢిల్లీ.. ఆర్సీబీ సైతం ప్లేఆఫ్స్‌కు | Delhi Capitals Beat RCB By 6 Wickets | Sakshi
Sakshi News home page

టాప్‌-2లో ఢిల్లీ.. ఆర్సీబీ సైతం ప్లేఆఫ్స్‌కు

Nov 2 2020 10:57 PM | Updated on Nov 2 2020 10:59 PM

Delhi Capitals Beat RCB By 6 Wickets - Sakshi

అబుదాబి:  ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరింది. రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరింది.  తొలి స్థానంలో ముంబై ఉండగా, రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో ఆర్సీబీ నిలిచాయి. ఇక రేపటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ సన్‌రైజర్స్‌ ఓడితేనే కేకేఆర్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆర్సీబీ నాల్గో స్థానంలో ఉంటుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే పృథ్వీ షా(9) వికెట్‌ను కోల్పోయింది.  మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి పృథ్వీ షా బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్‌(54; 41 బంతుల్లో 6 ఫోర్లు), అజింక్యా రహానే(60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించి విజయానికి బాటలు వేశారు. ఈ జోడీ 88 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. ఢిల్లీ స్కోరు 107 పరుగుల వద్ద ఉండగా ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. షహబాజ్‌ అహ్మద్‌ వేసిన 13 ఓవర్‌ నాల్గో బంతికి ధావన్‌ ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌(7) నిరాశపరిచాడు.  షహబాజ్‌ వేసిన 17 ఓవర్‌ రెండో బంతికి అయ్యర్‌ ఔటయ్యాడు. కాగా, వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 18 ఓవర్‌ రెండో బంతికి రివర్స్‌ స్వీప్‌ ఆడిన రహానే పెవిలియన్‌ చేరాడు. చివర్లో పంత్‌ 7 బంతుల్లో ఫోర్‌ సాయంతో 8 పరుగులతో నాటౌట్‌గా ఉండగా,  స్టోయినిస్‌ 5 బంతుల్లో 1 సిక్స్‌తో 10 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. . దేవదూత్‌ పడిక్కల్‌(50; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో పాటు విరాట్‌  కోహ్లి(29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), డివిలియర్స్‌(35; 21 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు) లు ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిట్సల్‌ పీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను  జోష్‌ ఫిలెప్పి,  పడిక్కల్‌లు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఉండగా ఫిలెప్పీ(12) పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి ఫిలెప్పి ఔటయ్యాడు. అనంతరం ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పడిక్కల్‌- కోహ్లిలు చక్కదిద్దారు. వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన ఈ జోడి ఆచితూచి ఆడింది. 

ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 13 ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌ ఆడిన కోహ్లి.. స్టోయినిస్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే పడిక్కల్‌తో కలిసి 40 పరుగులు జత చేశాడు. అయితే నోర్జే వేసిన 16 ఓవర్‌ నాల్గో బంతికి పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి  క్రిస్‌ మోరిస్‌ డకౌట్‌ అయ్యాడు. చివర్లో డివిలియర్స్‌, శివం దూబే(17; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు బ్యాట్‌ ఝుళిపించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు వికెట్లు సాధించగా, రబడా రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌కు వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement