
జకార్తా: ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు తొలి ఓటమి చవిచూసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున పవన్ (45వ ని.లో), ఉత్తమ్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మరో మ్యాచ్లో పాకిస్తాన్ 13–0తో ఇండోనేసియాపై గెలిచింది.
భారత్ సెమీఫైనల్ చేరాలంటే గురువారం జరిగే మ్యాచ్లో జపాన్ చేతిలో పాకిస్తాన్ తప్పనిసరిగా ఓడిపోయి... ఇండోనేసియాపై భారత్ భారీ విజయం సాధించాలి. ఒకవేళ జపాన్–పాక్ మ్యాచ్ ‘డ్రా’ అయితే భారత్ సెమీఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. జపాన్–పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక భారత్ మ్యాచ్ ఉంది కాబట్టి సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని గోల్స్ తేడాతో గెలవాలన్న సంగతి టీమిండియాకు తెలుస్తుంది.