న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 5 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన పేస్ బౌలర్ అజితేశ్ అర్గల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ 18 ఏళ్లలో ఇద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. కోహ్లి దిగ్గజ క్రికెటర్ స్థాయికి చేరుకోగా, అజితేశ్ కెరీర్ పెద్దగా సాగలేదు. అండర్–19 స్థాయిలో ప్రతిభ చూపి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీలో 19 మ్యాచ్లకే పరిమితమైన అతడిని ఐపీఎల్లో పంజాబ్ జట్టు తీసుకున్నా... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అజితేశ్ అంపైరింగ్ వైపు మళ్లాడు. ఈ నెల 22న తొలిసారి ఐపీఎల్లో అంపైరింగ్ చేసిన అజితేశ్ తన మూడో మ్యాచ్లో కోహ్లిని కలుసుకున్నాడు. సోమవారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో కోహ్లి ఆడుతుండగా, అజితేశ్ అంపైరింగ్ చేశాడు. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయత, ముచ్చట్లు ఆసక్తికర దృశ్యానికి చిరునామాగా నిలిచాయి.


